కౌలు రైతులకూ పంట రుణాలు | Crop loans also to tenant farmers in AP | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకూ పంట రుణాలు

Jul 16 2020 3:20 AM | Updated on Jul 16 2020 8:50 AM

Crop loans also to tenant farmers in AP - Sakshi

సాక్షి, అమరావతి: రైతులకు అన్నివిధాలా అండదండలు అందిస్తూనే.. కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పంట రుణాల పక్షోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే..

రైతుల హక్కులకు భంగం కలగదు: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌
► వ్యవసాయ రంగం అభివృద్ధిపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు.
► రైతులతో పాటు కౌలుదారులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో నూతన సాగుదారుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
► ఈ చట్టం వల్ల భూ యజమానులైన రైతుల హక్కులకు ఎటువంటి భంగం కలగదు. 
► 11 నెలల సాగు అనంతరం కౌలు హక్కులు వీడిపోయేలా చట్టం రూపొందించాం.
► కౌలుదారుల వివరాలను అధికారులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతులపై ఉంది.
► కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే పంట రుణాలిస్తోంది. ఏపీలో రైతులతో పాటు కౌలుదారులకూ రుణాలు అందించాలని సీఎం నిర్ణయించారు.

కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు : కురసాల కన్నబాబు
► రుణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు అందిస్తాం.
► రాష్ట్రంలో ఇప్పటివరకు 4,02,229 మందికి సీసీఆర్సీ కార్డులు అందజేశాం. మరో లక్షన్నర వరకూ కార్డులు అందిస్తాం. రూ.8,500 కోట్లను కౌలుదారులకు పంట రుణాలుగా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు.
► త్వరలో జిల్లాలు, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అభ్యుదయ రైతు అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బోర్డులు పంటల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయి. 
► రైతులకు వడ్డీ లేని రుణ బకాయిల కింద రూ.1,150 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. 
► ఈ విషయంలో బ్యాంకర్లు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.

రూ.200 కోట్లతో పొగాకు కొనుగోళ్లు
► పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అన్ని ప్లాట్‌ఫారాల్లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
► రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 55.5 శాతం అధికంగా కురవటం శుభసూచకం. ఖరీఫ్‌ పనులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే 32 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. 
► సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది మే నాటికే 12.61 లక్షల మంది రైతులకు 8.43 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందజేశాం. ఇప్పటికే రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ అందజేశాం.
► ప్రస్తుత వర్షాల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల నారుమడులు ముంపునకు గురైనట్టు సమాచారం అందుతోంది. వివరాలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించాం. సంబంధిత రైతులను ఆదుకుంటాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement