ఉద్యోగుల్లో అపోహలు తొలగించండి: సీఎం | Clarify to Seemandhra employees, says Kiran Kumar reddy | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల్లో అపోహలు తొలగించండి: సీఎం

Aug 15 2013 2:17 AM | Updated on Aug 13 2018 4:01 PM

ఉద్యోగ సంఘాలతో చర్చించి వారిలో అపోహలు, భయాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని ఆదేశించారు.

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ సంఘాలతో చర్చించి వారిలో అపోహలు, భయాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని ఆదేశించారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం బుధవారం సమీక్షించారు. సమ్మె వలన ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమలకు బస్సులను పునరుద్ధరించామని అధికారులు చెప్పారు. వివిధ శాఖల్లో హాజరు, జిల్లాల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.
 
 వైద్యసేవలు ఆగకూడదు: సహానీ
 సమ్మె కారణంగా వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ అధికారులను ఆదేశించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు సమ్మెలో ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 13 నుంచి ఎన్జీవోలు సమ్మెకు పిలుపునిచ్చిన కారణంగా పలు వైద్యాధికారుల కార్యాలయాల్లో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లగా అంతకు పది రోజులు ముందునుంచే పలువురు ఉద్యోగులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ నుంచి 10వేల మందికి పైగా సమ్మెలోకి వచ్చారు. వీరిలో పారామెడికల్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగులు అత్యధికంగా ఉన్నారు.
 
 శస్త్రచికిత్సలకు ఆటంకం కాకూడదు
 బోధనాసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అన్ని వైద్య కళాశాలల సూపరింటెండెంట్‌లకు, ప్రిన్సిపాళ్లకు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ శాంతారావు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement