‘మంచి నాయకులను ఎన్నుకోండి’ | Sakshi
Sakshi News home page

‘మంచి నాయకులను ఎన్నుకోండి’

Published Wed, Dec 18 2013 5:19 AM

Choose a good leader

రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని వినియోగించుకోవడం అంతే ముఖ్యమని ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు శశిభూషణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం రాజమహేంద్రి మహిళా కళాశాల ఆవరణలో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను కలసి ఓటు ప్రధాన్యతను వివరించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ కచ్చితంగా ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. యువతరం పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు.

కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఓటు హక్కుపై ఇంతమంది విద్యార్థులకు అవగాహన ఉండడం అభినందనీయమన్నారు. ఓటు వేయడం ద్వారా హక్కును సద్వినియోగపరచుకోవాలని విద్యార్థినులను కోరారు. జేసీ రేవు ముత్యాలరావు మాట్లాడుతూ చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం 60-70 శాతం మధ్య పోలింగ్ జరుగుతోందని, అది 80-90 శాతానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి కళాశాలలో 470 మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉందని నిర్వాహకుడు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ వేణుగోపాలరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమం అనంతరం రాజమహేంద్రి మహిళా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధికారులను సత్కరించారు. ప్రిన్సిపాల్ ప్రకాశరావు
 పాల్గొన్నారు.

Advertisement
Advertisement