కొట్టాయం: వీడీ సతీశన్ సమర్థుడైన నాయకుడని, ఆయన దూరదృష్టి, దృఢత్వంతో పాలించి మంచి ముఖ్యమంత్రి అవుతారని కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరువంచూర్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మంత్రివర్గాన్ని కేంద్ర నాయకత్వం ఆమోదంతో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలకు చాలా అంచనాలున్నాయని, మంత్రవర్గాన్ని ఏర్పాటు చేసేవారు ఈ గుర్తుంచుకోవాలన్నారు.
ఇతరులు చేస్తున్న వివిధ రకాల వ్యాఖ్యలకు ప్రభావితం కాకూడదని సూచించారు. ‘యూడీఎఫ్ ప్రభుత్వంపై ప్రజలకు భారీ ఆశలున్నాయి. అవి నెరవేర్చడానికి ఒక సమష్టి కృషి అవసరం. గత ప్రభుత్వ పనితీరే మళ్ళీ పునరావృతమైతే, ప్రజల అంచనాలు దెబ్బతింటాయి. అది మంచిది కాదు. ‘కొత్త కేరళ’ఆవిర్భవిస్తోందన్న భావన ప్రజలకు కలగాలి’అని అన్నారు. ఏ శాఖ విలువైనదని కాకుండా, మంత్రి తనకు అప్పగించిన శాఖను ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారన్న విషయానికే ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ప్రతి శాఖా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. కొత్త ప్రభుత్వంలో ఏ పాత్రను పోషించడానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను వెళ్లనని, పార్టీ అప్పగించిన పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించనని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశానికి రమేశ్ చెన్నితాల గైర్హాజరీ, ముఖ్యమంత్రి పేరు ప్రకటన తరువాత ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మాట్లాడుతూ.. సతీశన్కు మద్దతు తెలుపుతూ చెన్నితాల ఒక లేఖ ఇచ్చారని, అలాగే ఆయనకు అభినందనలు కూడా తెలిపారని ఆయన చెప్పారు.


