ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కుట్ర ఉందేమో..ఆలోచించండి! | Chief Minister comments .. think there's a conspiracy! | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కుట్ర ఉందేమో..ఆలోచించండి!

Aug 10 2013 2:46 AM | Updated on Sep 1 2017 9:45 PM

సమైక్యాంధ్ర ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో 9 రోజుల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడం వెనుక ఏదైనా కుట్ర దాగుందేమోనని, ఈ విషయంపై సమైక్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు.

రాయదుర్గం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో 9 రోజుల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించడం వెనుక ఏదైనా కుట్ర దాగుందేమోనని, ఈ విషయంపై సమైక్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని లక్ష్మీబజార్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పాలొని దీక్షాదారులకు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా కుట్రతోనే చేస్తుందని, దీంతో సీఎం వ్యాఖ్యల్ని సందేహించాల్సి వస్తోందని అన్నారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికా, లేక సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణిచి వేసే దిశగా పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే రైల్ రోకో చే సే వారిపై కేసులు పెడతామంటూ డీజీపీ హెచ్చరించారని ఆరోపించారు. 
 
 హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహించినపుడు విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎంత మందిపై కేసులు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై దాడి కేసులోను కొందరిని విడుదల చేయించార ని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఇలా మాట్లాడుతున్నారని, కేసులు పెట్టినా భయపడే వారు ఎవరూ లేరన్నారు. ఎన్‌జీఓలపై ఉద్యమం ఆధారపడి ఉందని, వీరే ప్రభుత్వానికి గుండెలాంటి వాళ్లని అన్నారు. రాష్ర్ట అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత పటిష్టంగా ఉద్యమాన్ని చేపట్టాలని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మన భవిష్యత్తు, భావి తరాల సంక్షేమం కోసం పోరాటాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘం నాయకుడు పరమేశ్వరప్ప మాట్లాడుతూ ఉద్యమం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, స్థానిక నాయకులు తలో మాట మాట్లాడుతున్నారని, దీంతో వారిని ఎవరూ నమ్మడం లేద న్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా రాజకీయ నాయకులు వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు పేర్మి బాలాజీ, గోనబావి శర్మాస్, సంజీవులు, జేఏసీ చైర్మన్ కెంచె లక్ష్మీనారాయణ, నాయకులు టీ.రామాంజనేయులు, వెంకటరామిరెడ్డి, సత్యనారాయణ, ఉబేదుల్లా, జలజాక్షి, బాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement