
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం నాడు ఇళ్లలోని విద్యుత్ లైట్లను ఆపేసి, జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు రాష్ట్ర ప్రజలంతా ప్రతిస్పందించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కోరారు.. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నేడు రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి, ఇంట్లోని విద్యుత్ దీపాలను ఆపివేసి, జ్యోతులు వెలిగించి ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలన్నారు. చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్లైట్లు, సెల్ఫోన్ ఫ్లాష్లైట్లు ... ఇలా ఏదో ఒక రూపంలో కాంతిని వెలిగించి, కరోనా అనే చీకటి మహమ్మారిని తరిమేద్దామనే సంకల్పాన్ని చాటడం అత్యవసరమన్నారు. తద్వారా మార్చి 22నాటి జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పాలన్నారు. విలువైన సమయంలో ఓ తొమ్మిది నిమిషాలు దేశం కోసం కేటాయించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. (సామాజిక దూరం పాటిద్దాం)