కాళింగ నర్తనోత్సవం | Beautiful treats for the eyes | Sakshi
Sakshi News home page

కాళింగ నర్తనోత్సవం

Mar 5 2015 1:49 AM | Updated on Sep 2 2017 10:18 PM

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దిగువ అహోబిలంలో కాళింగనర్తనోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణావతారంలో స్వామి వారు యమునానదిలో కాళింగ అనే సర్పం శిరస్సుపై తన పాదంను ఉంచి నాట్యమాడారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దిగువ అహోబిలంలో కాళింగ నర్తనోత్సవం కన్నుల పండువగా సాగింది. కృష్ణావతారంలో స్వామి యమునా నదిలో కాళింగ సర్పం శిరస్సుపై నాట్యమాడారు. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ కాళింగ నర్తనోత్సవాన్ని నిర్వహించారు. ఎగువ అహోబిలంలో భక్తుల గోవిందనామ స్మరణల మధ్య రథోత్సవం నిర్వహించారు. భక్తులు జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు.
 
 ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దిగువ అహోబిలంలో కాళింగనర్తనోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణావతారంలో స్వామి వారు యమునానదిలో కాళింగ అనే సర్పం శిరస్సుపై తన పాదంను ఉంచి నాట్యమాడారు. ఆ కృష్ణావతారాన్ని ప్రతిభింబిస్తూ కాళింగ నర్థనోత్సవాన్ని నిర్వహించారు.
 
 అహోబిలం తిరువీధులలో ఉత్సవం నిర్వహించిన అనంతరం  పల్లకి అహోబిలం మఠంకు చేరుకుంది. మఠంలో 46వపీఠాధిపతి శ్రీవన్‌శఠగోప యతీంద్ర మహదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారులకు అభిషేకాన్ని వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య రమణీయంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు తొట్టి తిరుమంజనం కార్యక్రమం జరిపారు. కృష్ణావతారంలో యమునానదిపై స్వామి వారు పాదాలు పెట్టి నదిని పునీతం చేశారు.
 
 పునీతమైన యమునా నది నీళ్లు తీసుకోలేని వారి కోసం అహోబిలం బ్రహ్మోత్సవాల సమయంలో వెండి గంగాళంలో నీరు తీసుకొని గంగ, యమునా, సరస్వతి నదులను ఆవాహనం చేసి పుణ్యాహవాచనం జరిపిన తరువాత శుద్ధజలంలో ఉత్సవమూర్తు పాదాలను ఉంచారు. అనంతరం ఆనీటిని భక్తులకు తీర్థంలో రూపంలో అందచేశారు. తొట్టితిరుమంజనంలో పీఠాధిపతి పాల్గొని పూజలు నిర్వహించారు. తొట్టితిరుమంజనం తరువాత ప్రహ్లాదవరదస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
 
 ఎగువ అహోబిలంలో: ఎగువ అహోబిలంలో రథోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులు జ్వాలానరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా రథం వరకు తీసుకవచ్చారు. రథోత్సవంలో వేదపండితులు వేదపారాయణం చదువుతుండగా ఉత్సవమూర్తులను రథంలో కొలువుదీర్చారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య రథం ముందుకు సాగింది. రథంను లాగి భక్తులు తన్మయత్వం పొందారు. రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఎగువ అహోబిల దేవాలయ ప్రాంగాణం భక్తులతో నిండిపోయింది.
 
 అహోబిలంలో నేడు:
 బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎగువ అహోబిలంలో ఉత్సవం, ద్వాదశారథనం, గరుడోత్సవం, దిగువ అహోబిలంలో రథోత్సవం, ఉత్సవం ఉంటాయని దేవస్థాన మేనేజర్ రామానుజన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement