సాక్షాత్తు కేంద్ర మంత్రి అల్పాహారంలేక సొమ్మసిల్లిపడిపోయిన సంఘటన ఆదివారం విశాఖలో జరిగింది.
విశాఖపట్నం: సాక్షాత్తు కేంద్ర మంత్రి అల్పాహారంలేక సొమ్మసిల్లిపడిపోయిన సంఘటన ఆదివారం విశాఖలో జరిగింది. ఉదయమే విమానంలో విశాఖ వచ్చిన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కు వెళ్లారు. అటునుంచి నేరుగా పోర్టు ప్రాంగణంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి సందర్శనకు వెళ్లారు. ఎక్కడా ఆయన అల్పాహారం స్వీకరించలేదు. ప్రొటోకాల్ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో షుగర్ లెవెల్స్ పడిపోయి దత్తాత్రేయ సొమ్మసిల్లారు.
వెంటనే గుర్తించిన పార్టీ నేతలు ఆయనను గదిలోకి తీసుకువెళ్లి సపర్యలు చేశారు. అల్పాహారం చేయలేదని తెలుసుకుని అందించారు. ఈ విషయమై ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అధికారులు, ఆస్పత్రి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతని ఈఎస్ఐ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ రాధాకృష్ణపై మండిపడ్డారు. అల్పాహారం ఏర్పాటు చేయాల్సిందిగా తమకు చెప్పలేదంటూ రాధాకృష్ణ కూడా అంతేస్థాయిలో సమాధానమివ్వడంతో వారిమధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.