బొడ్డు ఊడక ముందే ఓ పసిగుడ్డు తల్లిదండ్రులు రోడ్డు పాల్జేశారు. గల్లీలో శిశువు ఏడుపులు విన్న చుట్టు పక్కల ప్రజలే పాలు పట్టించి చేరదీశారు.
జిన్నారం, న్యూస్లైన్: బొడ్డు ఊడక ముందే ఓ పసిగుడ్డు తల్లిదండ్రులు రోడ్డు పాల్జేశారు. గల్లీలో శిశువు ఏడుపులు విన్న చుట్టు పక్కల ప్రజలే పాలు పట్టించి చేరదీశారు. ఈ సంఘటన మండలంలోని బొల్లారం గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం గ్రామంలో గల ఎస్సీ బస్తీలోని ఓ గల్లీలో గురువారం అర ్ధరాత్రి శిశువు ఏడుపులు వినిపించడంతో కాలనీకి చెందిన అనసూయ అక్కున చేర్చుకుని పాలు పట్టింది. విషయాన్ని కాలనీ వాసులు శుక్రవారం ఉదయం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాల్రెడ్డికి తెచ్చారు. ఆయన ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు విజయలక్ష్మి, స్రవంతిలు కాలనీకి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును వదిలేసినట్లు వారు అంచనాకు వచ్చారు.
అనంతరం కాలనీ వాసులు ఐసీడీఎస్ అధికారులకు పోలీసుల సమక్షంలో శిశువును అందించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్లు మాట్లాడుతూ సుమారు మూడు రోజుల వయస్సున్న మగశిశువును సంగారెడ్డిలోని శిశుగృహకు ఈ శిశువును తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై విచారణను జరుపుతున్నట్లు వెల్లడించారు.