వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై దాడి | attack on supporters of YSR CP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై దాడి

May 4 2015 4:59 AM | Updated on Aug 10 2018 8:13 PM

మండలంలోని పూలకుంటలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై ఆదివారం రాళ్ల వర్షం కురిపించారు.

పూలకుంట(గుమ్మఘట్ట) : మండలంలోని పూలకుంటలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై ఆదివారం రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఉపాధి క్షేత్రసహాయకుడు గంగప్ప, గౌనికుంట ప్రభుత్వ చౌక దుఖాణపు డీలర్ రాధాస్వామి  తీవ్రంగా గాయపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యు డు నాగరాజు,  మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. గ్రామం లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై తనిఖీలు నిర్వహించిన అనంతరం సామాజిక బృందం సభ్యులు గ్రామసభ నిర్వహించారు.

ఈ గ్రామ సభకు డీఆర్పీ, గ్రామ సర్పంచ్ ముసలిరెడ్డి, ఏపీఓ వెంకటేశ్‌నాయక్, క్షేత్రసహాయకుడు గంగప్ప హాజరయ్యారు.  గ్రామ సభకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ నేతలు కొందరు వచ్చి అడ్డుతగిలారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్షేత్ర సహాయకుడు గంగప్పను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దీంతో ఏపీఓ కలుగజేసుకుని తొలగించినా కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురావడంతో మళ్లీ కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. అయినా వినకుండా అతని స్థానంలో గంగధర్‌నే కొనసాగించాలని పట్టు పట్టారు.

అలా అయితే సభ నిర్వహించండి.. లేదంటే వెనక్కి వెళ్లిపోం డంటూ అధికారులపై మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.. కేవలం రాజకీయ కక్షతోనే తొలగించారని క్షేత్ర సహాయకుడు సమాధానం చెప్పడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు, క్షేత్రసహాయకుడు గంగప్పపై టీడీపీ వర్గీయులు, తొలగించిన క్షేత్రసహాయకుడు గంగాధర్, బొమ్మన్న, జన్మభూమి కమిటీ సభ్యుడు నాగరాజు, సొంటు నింగప్ప, లక్ష్మిదేవి, నాగరాజు దాడికి తెగబడ్డారు.

విషయం తెలుసుకున్న గంగప్ప సోదరుడు, డీలర్ రాధాస్వామి అడ్డు వెళ్లడంతో అతడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో టీడీపీ వర్గీయులైన నాగరాజు మరో వ్యక్తి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇరు వర్గాల వారు చికిత్స కోసం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేరారు.  ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement