ఆత్మలకూ రుణాలు! | Atmalaku loans! | Sakshi
Sakshi News home page

ఆత్మలకూ రుణాలు!

Mar 11 2015 3:58 AM | Updated on Sep 2 2017 10:36 PM

ఇదో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ... ఇక్కడ పని చేస్తున్నవారికి ఆత్మలతో పరిచయాలున్నాయి... దయ్యాలు వారికి దాయాదులు.

ఇదో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ... ఇక్కడ పని చేస్తున్నవారికి ఆత్మలతో పరిచయాలున్నాయి... దయ్యాలు వారికి దాయాదులు. చనిపోయినవారంతా వీరికి చుట్టాలే. శవాలపై కాసులేరుకోవడం ఇక్కడ పని చేస్తున్న కొందరికి భలే సరదా... సజీవంగా చెట్టంత మనిషి ఎదురుగా కనిపించినా  బతికున్నట్టు ధ్రువపత్రం ఇస్తేగానీ పింఛన్లివ్వని ఈ రోజుల్లో  పదేళ్ల కిందట చనిపోయినా సరే భేషుగ్గా బతికే ఉన్నారంటూ ఎంచక్కా రుణాలు ఇచ్చేసిన ఘనులున్నారంటే మీకు నమ్మశక్యంగా లేదా...  అద్దంకి మండలం గోవాడ సొసైటీలో ఈ తంతు సాగుతోంది.  కన్నుమూసినవారికే కాదు బినామీ పేర్లను సృష్టించి కూడా కాసులు కురిపించేస్తున్నారు. ఆ హస్తలాఘవాల అవినీతి కథేంటో మీరే చదవండి...
 
ఒంగోలు వన్‌టౌన్: బతికున్న వాళ్లకు రుణం పుట్టక నానా అవస్థలు పడుతుంటే అద్దంకి మండలం గోవాడ సొసైటీలో మాత్రం చనిపోయిన వారికి కూడా రుణాలు అందజేస్తున్నారు. చనిపోయినవారి పేర్లతోపాటు నిబంధనలు పరిధి దాటి కూడా లక్షల్లో రుణాలు ఇవ్వడంతో భారీగా దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో ఈ తరహా అక్రమాలు 2013-14 ఆర్థిక సంవత్సర ఆడిట్‌లో బట్టబయలవడంతో ఆడిట్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

ఈ అవకతవకలపై సొసైటీ ఆడిటర్ అధికారులకు ప్రత్యేక నివేదికను కూడా సమర్పించారు. సొసైటీలో తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయిన వారి పేరుతో కూడా రుణాలు మంజూరు చేసిన ఘటనలూ బయటపడ్డాయి. కోఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు (సికెసిసి) విధానంలో సభ్యుల ఫోటోలు మార్చి సర్వే నెంబర్లను కూడా తప్పుగా నమోదు చేసి రుణాలు మంజూరు చేసినట్లుగా ఆడిటర్లు గుర్తించారు. సభ్యులకు రుణ మంజూరుకు సంబంధించి క్రెడిట్ లిమిట్ అప్లికేషన్ (సిఎల్‌ఎ) పరిమితిని మించి కొందరు రుణాలు మంజూరు చేసినట్లు తేలింది.

ఈ సొసైటీలో మరిన్ని అక్రమాలు జరిగి ఉంటాయని, దీనిపై ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 51 ప్రకారం సమగ్ర విచారణ జరిపించాలని ఆడిటర్‌కు సిఫార్సు చేస్తూ ప్రత్యేక నివేదికను సమర్పించారు. ఒంగోలు డివిజనల్ సహకారాధికారి కూడా ఈ సొసైటీలో ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సొసైటీ పాలకవర్గం భారీ అక్రమాలకు పాల్పడినందున సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా సహకారాధికారికి సిఫార్సు చేశారు.
 
సి.ఎల్.ఎ.ను మించి రుణాలు
సొసైటీల్లో రుణాల మంజూరుకు సంబంధించి ఏ రైతుకు ఎంత రుణం మంజూరు చేయాలన్నది మొదట క్రెడిట్ లిమిట్ అప్లికేషన్ (సిఎల్‌ఎ)లో ఖరారు చేస్తారు. సి.ఎల్.ఎ.ను సొసైటీలకు ఆర్థిక సాయం అందించే పీడీసీసీ బ్యాంకు ఆమోదిస్తుంది. సిఎల్‌ఎలో పేర్కొన్న మొత్తానికి లోబడే రైతులకు రుణం మంజూరు చేయాలి. అయితే సిఎల్‌ఎ రుణ పరిమితిని మించి కొందరు రైతులకు భారీగా రుణాలు మంజూరు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. శిరీష, బిళ్ళా కోటమ్మ, అంకం ఏడుకొండలు, అద్దెపల్లి మోహనరావు తదితరులకు సొసైటీ బైలాలు, చట్టాలు, నిబంధనలు అధిగమించి రుణాలు మంజూరు చేశారు.
 
విచారణకు ఆదేశం...
గోవాడ సొసైటీలో జరిగిన అక్రమాలన్నింటిపై విచారణకు ఆదేశిస్తూ జిల్లా సహకారాధికారి సిహెచ్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణాధికారిగా ఒంగోలు సబ్ డివిజనల్ సహకారాధికారి కె.వెంకటేశ్వరరావును నియమించారు. సొసైటీ ఆడిటర్ సమర్పించిన ప్రత్యేక నివేదికలో ప్రస్తావించిన అంశాలన్నింటిపై సమగ్రంగా విచారణ జరపమన్నారు. సొసైటీ ఆర్థిక పరిస్థితి, బినామీ రుణాలు తదితర అంశాలన్నింటిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీసీఓ ఆదేశాలు జారీ చేశారు.
 
మరణించినవారికి ఇలా...
గోవాడ సొసైటీ పరిధిలోని ఏలేశ్వరపాలెం గ్రామానికి చెందిన సొమ్మబత్తిన లక్ష్మయ్య తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన బతికున్నట్లుగానే అధికారులు చూపిస్తూ  కోఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ నెం.1145లో 25/02/2012న రూ. 10 వేలు రుణం మంజూరు చేశారు.
 సొసైటీ పరిధిలోని యంపరాలకు చెందిన సొమ్మబత్తిన ఆదినారాయణ ఎనిమిది సంవత్సరాల క్రితమే మరణిం చారు. అయితే ఆయన సీకెసీసీ లోన్ నెం. 1131కి 31/03/2011న రూ.67 వేలు రుణం మంజూరు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
 
బినామీలూ అధికమే...
గోవాడ సొసైటీలో బినామీ రుణాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అధికారులకు అందాయి. పలువురు రైతులకు ఇతర సొసైటీలో రుణాలున్నప్పటికీ గోవాడ సొసైటీలో కూడా రుణాలు మంజూరు చేశారు. సొసైటీ పరిధిలోని శిఖాకొల్లి కోటేశ్వరరావు, పావులూరి శివయ్య, సాయంపు వెంకటేశ్వర్లు, సాతులూరి వెంకటేశ్వర్లుకు గోవాడ సొసైటీతోపాటు కొమ్మినేనివారిపాలెం, పర్చూరు, వలపర్ల సొసైటీలకు కూడా రుణాలున్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement