తీరనున్న ‘గంగ’ బెంగ

AP Government Green Signal to Telugu Ganga Canal Works Kadapa - Sakshi

తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్‌  పనులకు ప్రభుత్వం గ్రీన్‌ స్నిగల్‌

రూ. 239.04 కోట్లతో పనులకు టెండర్లు

49 కిలోమీటర్ల మేర లైనింగ్‌

పనులు పూర్తయితే బ్రహ్మంసాగర్‌కు నీరు

ఎస్‌ఆర్‌–1, ఎస్‌ఆర్‌–2లకు కూడా ..

1.77 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

లైనింగ్‌ పనులను గాలికొదిలేసిన గత ప్రభుత్వం  

దిగువకు నీరు సక్రమంగా చేరని పరిస్థితి

సాక్షి ప్రతినిధి కడప : తెలుగుగంగ ప్రధాన కాలువ  లైనింగ్‌ పనులకు శ్రీకారం చుట్టింది. వరదకాలంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీరివ్వాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం మిగిలిపోయిన ఈ పనులను చేపడుతోంది. కర్నూలు జిల్లాలో  తెలుగుగంగ ప్రధానకాలువ 0 కిలోమీటరు నుండి 42.566 కిలోమీటరు వరకు లైనింగ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోపాటు  బనకచర్లక్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ నుండి వెలిగోడు రిజర్వాయరు వరకు లింక్‌ కెనాల్‌ 0 కిలోమీటరు నుండి 7.830 కిలోమీటర్ల మేర లైనింగ్‌ పనులు నిలిచిపోయాయి. మొత్తంగా దాదాపు 50 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. లైనింగ్‌ పనులు పూర్తయితేనే మన జిల్లాలోని తెలుగుగంగ  ప్రాజెక్టులో భాగమైన ఎస్సార్‌–1,ఎస్సార్‌–2  సబ్సిడరీ రిజర్వాయర్‌లతో పాటు  17.730 టీఎంసీల సామర్థ్యం కలిగిన బ్రహ్మంసాగర్‌  రిజర్వాయర్‌లకు çసక్రమంగా నీరు చేరుతుంది. ప్రస్తుతం ప్రధాన కాలువ సామర్థ్ద్యం పేరుకు 5 వేల క్యూసెక్కులు  అంటున్నా...2,500 క్యూసెక్కులకు మించి నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు.  ఈ ఏడాది స్థానికంగానే కాక ఎగువన భారీ వర్షాలు కురిసి శ్రీశైలం నిండి దిగువకు పెద్ద ఎత్తున కృష్ణాజలాలు చేరా యి. జిల్లాలోని గండికోట, మైలవరం, చిత్రావతి, వామికొండ, సర్వారాయసాగర్‌తో పాటు చిన్నచిన్న సాగునీటి వనరులకు నీరు చేరింది. కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సాగునీరందింది. 

కాలువలు సామర్థ్యం తక్కువగా ఉండడంతో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని నీటివనరులకు పూర్తి సామర్థ్యం మేరనీరు చేరలేదు. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 17.73 టీఎంసీలు కాగా, ఎస్‌ఆర్‌–1, ఎస్‌ఆర్‌–1 సబ్సిడరీ రిజర్వాయర్ల సామర్థ్యం మరో నాలుగు టీఎంసీలు ఉంది.  దాదాపు 22 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 11 టీఎంసీలు కూడా చేరలేదు. దీంతో 1.77 లక్షల ఎకరాల ఆయకట్టులో పట్టుమని 50 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా నీరు చేరిన పరిస్థితి లేదు.  ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ప్రధాన కాలువ లైనింగ్‌ పనులను పట్టించుకోలేదు. చివరిలో కాంట్రాక్టర్ల కోసం అంచనాలు పెంచుకుని టెండర్లు పిలువగా సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టు 2.89 శాతం అధిక ధరలకు కోట్‌ చేసి పనులు దక్కించుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై కోట్లాది రూపాయల అదనపు భారం పడింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత టెండర్లను రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో సదరు పనులకు రూ. 239.04  కోట్లతో టెండర్లు నిర్వహించింది. సోమవారమే అధికారులు ఫైనాన్స్‌ బిడ్‌ తెరిచారు. ఆ తర్వాత నిర్వహించిన ఇ–ఆక్షన్‌ (రివర్స్‌ టెండరింగ్‌)లో 1.32 శాతం తక్కువ కోడ్‌ చేసిన రాఘవ కన్‌క్షషన్‌ పనులు దక్కించుకుంది. రివర్స్‌ టెండరింగ్‌తో రూ. 10.06 కోట్లు ఆదా అయ్యాయి.

కరువునేపారదోలేలక్ష్యం
ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమతోపాటు కడప జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులను గాలికి వదలగా, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో కరువును పారదోలేందుకు సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని నిర్ణయించింది.  కొత్త ప్రాజెక్టులతోపాటు గాలేరు–నగరి, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు చెందిన ప్రధాన కాలువలను విస్తరించనుంది. 40 రోజుల వరద కాలంలోనే నీటిని దిగువకు తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం యుద్ధ్ద ప్రాతిపదికన ఈ పనులు చేపడుతోంది. తెలుగుగంగ లైనింగ్‌ పనులు పూర్తయితే సకాలంలో దిగువకు నీరు చేరి ప్రాజెక్టు పరిధిలోని 1.77 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వం కాలువ ఆ«ధునికీకరణ పనులకు టెండర్లు పిలువడంపై ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top