ప్రీమియం కోత.. అయినా అందని వైద్యం
ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఉద్యోగుల జీతాల నుంచి ప్రీమియం మొత్తాన్ని కట్ చేస్తున్నారు గానీ, వాళ్లకు వైద్యం మాత్రం అందడం లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మండిపడ్డారు. రెండు నెలల పాటు తాత్కాలికంగా ఈ పథకాన్ని నిలిపివేసే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మరో రెండు నెలల పాటు మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.
అయితే, నవంబర్ ఒకటో తేదీ నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ వర్తించదని ఇటీవలే ఏపీ సర్కారు జీవో జారీచేసింది. దాంతో అటు రీయింబర్స్మెంట్ రాక, ఇటు హెల్త్ పాలసీ అమలుకాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఆస్పత్రులలో ఉద్యోగులకు హెల్త్ పాలసీ అమలు చేయట్లేదని అశోక్ బాబు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులతో ఎంఓయూ కుదరలేదంటూ వైద్యానికి నిరాకరిస్తున్నారన్నారు. రెండు నెలల పాటు రీయింబర్స్మెంట్ కొనసాగించేందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యం అంగీకరించారని ఆయన తెలిపారు.