ఆశల పల్లకి!

ఆశల పల్లకి! - Sakshi


 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా జిల్లాపై వరాల జల్లు కురిపించి ప్రజల్లో ఆశలు రేకెత్తించారు. గురువారం రాష్ట్ర నూతన రాజధాని ప్రకటన సందర్భంగా అభివృద్ధి పనుల ప్రతిపాదనల్ని ప్రకటించారు. శ్రీకాకుళాన్ని స్మార్ట్‌సిటీగా తయారు చేస్తామని, భావనపాడు, కళింగపట్నం రేవుల్లో పోర్టులేర్పాటు చేస్తామని, వంశధార, నాగావళి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామన్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెస్తామని, ఎయిర్‌పోర్టుతో పాటు కేంద్రం సహాయంతో ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధులు తెప్పిస్తామని, జిల్లా మీదుగా టూరిజం సర్య్కూట్ ఏర్పాటు, జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలేర్పాటు చేస్తామని ముఖ్యమంత్రే శాసనసభలో ప్రకటించడం సిక్కోలు వాసుల్ని ఆశలపల్లకిలో ఊరేగించినట్లయింది.

 

 బాబు ప్రకటనలు ప్రజల్ని ఆనందోత్సవాల్లో ముంచెత్తింది. అయితే వాటిని ఎన్నాళ్లలో పూర్తిచేస్తారు? నిధులెక్కడినుంచి వస్తాయి, జిల్లాలో మిగిలిపోయిన ఇతర ప్రాజెక్టుల మాటేమిటి? మౌలిక సదుపాయాల మాటను గాలికొదిలేసి జిల్లాను ప్రభావితం చేసే ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరంటున్నారు. దేశంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అది జిల్లాకు సంబంధించి ఉంటోందని, ప్రమాదాలకు గురైన వారిలో ఇక్కడి ప్రజలే ఉంటున్నారని, తలసరి ఆదాయం తక్కువగా ఉందని సీఎం స్పష్టం చేశారు. అరుుతే వెనుకబడిన జిల్లాగా, వలసల ఖిల్లాగా పేరొందిన శ్రీకాకుళం ప్రజలకు భవిష్యత్తులో కావాల్సింది గాల్లో ఎగరడం కాదు రోడ్లు, మంచినీటి సదుపాయం, ఇళ్ల నిర్మాణం వంటివే ముఖ్యమైనవి. అరుుతే వీటిని కాకుండా అసంబద్ధమైన, కాలయాపనతో కూడిన, రూపాయి ఆదాయం లేకుండా భారీ ఖర్చుతో అద్దాల మేడలు నిర్మిస్తామని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.

 

 నిధుల మాటేమిటి?

 మొన్నటి బడ్జెట్‌లో జిల్లాకు కేటాయించింది అరకొర నిధులే. ఏడాదిలో వాటితో కనీస సౌకర్యాలు కూడా సమకూరవు. అలాంటిది కోట్లాది రూపాయల ఖర్చుతో పలు ప్రాజెక్టులు నిర్మిస్తామని మాటివ్వడం వెనుక జిల్లా ప్రజల్ని కవ్వించడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న జిల్లాకు ఎరువులు, విత్తనాల సరఫరా దారుణంగా ఉంది. నిరుద్యోగ యువత వలస బాట పడుతున్నారు. పేదలు అలాగే మిగిలిపోతున్నారు. పింఛన్లకు భరోసా లేదు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని గాలికొదిలేశారు.  ప్రభుత్వం గుర్తించిన స్థలాలపై స్పష్టత లేదు. అలాంటిది ఎయిర్‌పోర్ట్, పోర్టుల నిర్మాణం తదితర అంశాలపై ఊకదంపుడు ప్రసంగాలు చేసినబాబు మాట నిలబెట్టుకుంటారా అని ప్రజలు అడుగుతున్నారు.

 

   టూరిజం సర్క్యూట్, తేలినీలాపురం, బౌద్ధారామాలు, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వం టివి అభివృద్ధి చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఇటీవలే పురావస్తుశాఖ నుంచి నిధులు వెనక్కి వెళ్లిపోయి, ప్రాజెక్టులు సగంలోనే ఆగిపోయిన విషయా న్ని ఎందుకు గుర్తించలేకపోయారు? రోడ్డు, భవనాల శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం జిల్లాకు కేటాయిం చిన సుమారు రూ.320 కోట్లు పనుల్ని ప్రభుత్వం ఎం దుకు ఆపించింది అనే విషయంలోనూ స్పష్టత లేదు.

 

   భావనపాడు, కళింగపట్నం బీచ్‌ల అభివృద్ధితో పాటు పోర్టులు ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు, నిపుణుల కమిటీ వచ్చి, డ్రెడ్జింగ్ విభాగం సర్వే చేపట్టి ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టులు ఆగిపోయిన విషయం జిల్లా నేతలకు తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వంశధార, నాగావళి ప్రాజెక్టుల్ని పూర్తిచేయిస్తామంటున్న సీఎం నారాయణపురం ఆనకట్ట శిథిలావస్థలోకి వెళ్లిపోయిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారని ఆవేదన చెందుతున్నారు. మడ్డువలస కాలువల నిర్మాణం గురించి నేతలు ప్రస్తావనే తేవడం లేదు. తోటపల్లి విస్తరణ పనులకు రూ.230 కోట్లు అవసరం అని నిపుణులు తేల్చితే మొన్నటి బడ్జెట్‌లో విదిల్చింది ఎంతో పాలకులకు తెలియనిది కాదు. అదీ కాకుండా ఏడాది వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేస్తామని సీఎం ప్రకటించడంపై జిల్లా ప్రజలు విస్తుపోతున్నారు.

 

 ఎయిర్‌పోర్ట్ మాటేమిటి?

 జిల్లా కేంద్రంలో కనీసం రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయలేకపోయారు. టీడీపీ హయంలోనే జిల్లాలో రూ.10 కోట్లుతో రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని ప్రతిపాదించిన విషయాన్ని నేతలు మర్చిపోయారు. అరుుతే అంపోలు ప్రాంతంలో ఖాళీ భూము ల్లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం గుర్తించింది. అందుకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాల్సి ఉంది. అధికంగా వలసలు వెళ్తున్న జనం, కూలీకి సైతం ఇబ్బంది పడుతున్న ప్రజలు, మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోని ప్రభుత్వం..ఇప్పుడు కేవలం పది శాతంలోపే ఉపయోగించుకునే విమానాశ్రయం అవసరం ఏమిటనే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. జిల్లా యువత వివిధ ప్రాంతాల్లో ఇంజినీరింగ్, ఇతర విభాగాలకు వలస వెళ్లిపోయారు. నిరుద్యోగ యువత కోసం ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్క్‌ను రప్పిస్తే జిల్లా అభివృద్ధి మరెంతో దూరంలో లేదు. అలాగే ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటు ప్రకటనను ముఖ్యమంత్రి  సకారం చేయాల్సిన బాధ్యత ఉంది.

 

 ఓపెన్ యూనివర్సిటీ?

 జిల్లాకు అభివృద్ధి ఫలాలు అందుతాయంటే వ్యతిరేకించే వారెవరూ ఉండరు. సాధ్యాసాధ్యాలపైనే అందరి అనుమానం. జిల్లాకే తలమానికమైన బీఆర్‌ఏయూ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. మొన్నటి బడ్జెట్‌లో నిధులు విదిల్చిందీ అరకొరే. విశాఖలో నిర్వహించిన వర్సిటీల వీసీల సదస్సులో కూడా ఇక్కడి అధికారులు భారీ కోరికలు కోరారు. బడ్జెట్‌లో నిధుల కేటారుుంపు చూసి అవక్కయ్యూరు. ఈ నేపథ్యంలో ఓపెన్ వర్సిటీ ఏర్పాటు ఎంతవరకు సాధ్యమన్నది పాలకులే చెప్పాలి.

 

 స్మార్ట్‌సిటీ?

 జిల్లాను స్మార్ట్‌సిటీగా చేస్తామని బాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందంటున్నారు ప్రజలు. అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? ఏ నగరాన్ని ప్రాతిపదికగా తీసుకుని వెనకబడిన జిల్లాగా పేరొందిన జిల్లాను స్మార్ట్‌సిటీగా.. ఎలా తీర్చిదిద్దుతారన్న విషయంలో సీఎం స్పష్టత ఇవ్వలేదు. జిల్లా కేంద్రంలో ఇప్పటికీ సరైన మురుగునీటి వ్యవస్థ లేదు. మున్సిపాలిటీ వసూలు చేస్తున్న పన్నుల మొత్తానికీ పనులు నిర్వహించడం లేదు. కరెంట్ కోతలు తప్పడం లేదు. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్నా సరైన వసతులు లేవు.     

 

 సమయం ఏదీ?

 చంద్రబాబు ప్రకటించిన అభివృద్ధి ఫలాలు అందాలంటే మరో యుగం చూడాల్సిందేనా అని జనం ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు. భారీ ఖర్చుతో కూడుకున్నవి మరెంత కాలం పడుతుందో. అభివృద్ధిని కాంక్షించడంలో తప్పులేదు.  ఎంత సమయంలో వీటిని పూర్తిచేస్తారో అనేదే ప్రశ్న. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు బాధ్యత వహిస్తున్నారు. వీరిలో ఒక మంత్రి, మరొకరు విప్ కూడా ఉన్నారు. ఎమ్మెల్సీలూ ఉన్నారు. వీరంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి జిల్లాకు రావాల్సిన నిధుల్ని సకాలంలో తెప్పిస్తే కచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. ఎంపీ అశోక్‌గజపతిరాజు విమానయాన మం త్రిగాఉన్నారు. ఆయన హయాంలో నిజంగా జిల్లాకు ఎయిర్‌పోర్ట్ వస్తే దాని ఆధారంగా ఎంతోమందికి బతుకు దెరువు దక్కుతుంది. చంద్రబాబు ప్రకటనలు నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. అయితే దానికి కావాల్సింది నాయకుల్లో నిబద్ధతే. గడువులోగా పనులు పూర్తయితే జిల్లా సశ్యశ్యామలం కాకమానదు.

 

 ధర్మామీటర్‌కూ కొరతే

 వెనుకబడిన జిల్లాను ముందుకు నడిపిస్తామంటే సంతోషమే.  పాతపట్నం, నందిగాం తదితర గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్యం గగనమే. ధర్మామీటర్‌తో పరీక్షలు చేసేందుకూ ఇబ్బందే. జాతీయరహదారిని కలుపుకుని అభివృద్ధి వస్తుందంటే అంతకంటే ఆనందం మరొకటి లేదు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు రోడ్లు, మంచినీటి ఏర్పాట్లపై పాలకులు దృష్టిసారించాలి. విమానాశ్రయాలు,  భారీ ప్రాజెక్టులేర్పాటు చేస్తామని గొప్పలు చె ప్పుకోవడం తగదు. టీడీపీ నాయకులు మాటల గారడీ చేస్తున్నారు.

 - రెడ్డి శాంతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు  

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top