కడప బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాకు బయల్దేరారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో బయల్దేరి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు. 8.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళతారు. 8.50 నుంచి 9.10 గంటల వరకూ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు.
9.15 గంటలకు రోడ్డు మార్గాన బయల్దేరి 9.30 గంటలకు చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రానికి చేరుకుంటారు. గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 10 గంటల వరకూ అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలికాఫ్టర్లో బయల్దేరి 10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి బహిరంగ సభ ప్రదేశానికి వెళతారు. అక్కడ ఏర్పాటు చేసి స్టాల్స్ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు.
వైఎస్ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే రైతు దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే కడప, ఇడుపులపాయ, గండి, జమ్మలమడుగు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.