మత్స్యకారుడు చిన్నాకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Mohan Reddy Phone Call to Fisherman Kare Chinna | Sakshi
Sakshi News home page

మత్స్యకారుడు చిన్నాకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jul 10 2026 5:10 AM | Updated on Jul 10 2026 5:10 AM

YS Jagan Mohan Reddy Phone Call to Fisherman Kare Chinna

రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని బాధితుడి ఆవేదన

ప్రభుత్వం బోటుకు పరిహారం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన వైఎస్‌ జగన్‌ 

ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా అండగా ఉంటామని భరోసా

సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి, అక్కిరెడ్డిపాలెం: చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో త్రుటిలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు, బోటు డ్రైవర్‌ కారి చిన్నాను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో గురువారం పరామర్శించారు. విశాఖ షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను ఓదార్చి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రాత్రి సముద్రంలో ఏం జరిగింది? ప్రమాదం తర్వాత బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అంత దూరం ఎలా ఈదారు?  ఎవరు రక్షించారు? అనే వివరాలను చిన్నా ఆయనకు వివరించారు.

అవసరమైతే స్వయంగా విశాఖకు వస్తా..
మొత్తం అప్పు చేసి పడవ సమకూర్చుకున్నామని, ఇప్పుడు అంతా నష్టపోయి వీధిన పడ్డామని చిన్నా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నుంచి తనకు  ఎలాంటి సాయం అందలేదని, దాదాపు రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని వాపోయాడు. బాధితుడికి ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌ అవసరమైతే తాను స్వయంగా విశాఖకు వస్తానని భరోసా ఇచ్చారు. పడవ కోల్పోయిన మత్స్యకారుడికి ప్రభుత్వం పరిహారం ఇవ్వక­పోవడాన్ని తప్పుబట్టారు. 

బోటు మునిగిపోతే ఉపాధి కోల్పోతారని, బాధి­తుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ విశాఖ, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్తలు దేవాన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్‌ తదితరులు ఆస్పత్రిలో బాధితుడు చిన్నాను పరామర్శించారు. 

బాధితుడిని పట్టించుకోని ప్రభుత్వం
ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను మాత్రం పూర్తిగా విస్మరించింది. కనీసం ఏ అధికారీ వచ్చి పలకరించలేదు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు గల్లంతు కాగా చిన్నా  ఈదుకుంటూ వెళ్లి చైనా నౌక సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సముద్రంలో పడవ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందినా సకాలంలో స్పందించడంలో తీవ్ర అలక్ష్యం చూపిందని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement