రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆధారంగా అనంతపురం రూరల్ మండలంలో అత్యధికంగా మాఫీ అయింది.
అనంతపురం అగ్రికల్చర్ : రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆధారంగా అనంతపురం రూరల్ మండలంలో అత్యధికంగా మాఫీ అయింది. పంట, బంగారు రుణాల మాఫీ కోసం జిల్లా బ్యాంకర్లు 9,86,595 అకౌంట్లు సేకరించి పంపారు. అందులో తొలి విడతగా ప్రకటించిన జాబితాలో 6,62,663 అకౌంట్లకు మాఫీ వర్తింపజేశారు. అందులో కొన్ని రూ.50 వేలు లోపు కాగా 20 శాతం మాఫీ అయినవి ఎక్కువ అకౌంట్లు ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. తక్కిన 3.24 లక్షల అకౌంట్ల పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. 2,21,144 అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు జిల్లా మంత్రులు చెబుతున్నారు.
రెండో విడతలో వీటికి మోక్షం లభించినా ఇంకా 1.03 లక్షల అకౌంట్ల పరిస్థితిపై అంతు చిక్కడం లేదు. ఇదిలా ఉండగా తొలివిడత ప్రకటించిన 6,62,663 అకౌంట్ల అర్హుల జాబితాలో అనంత పురం రూరల్ మండలంలో అత్యధికంగా 45,771 అకౌంట్లకు మాఫీ వర్తింపజేశారు. ఆ తరువాత స్థానాల్లో కళ్యాణదుర్గం మండలంలో 26,237 అకౌంట్లు, పెనుకొండ మండలంలో 24,456 అకౌంట్లు, ఉరవకొండ మండలంలో 23,847 అకౌంట్లు ఉన్నాయి. తక్కువగా మాఫీ అయిన వాటిలో నల్లచెరువు మండలంలో 2,653 అకౌంట్లు, ఎన్పీ కుంట మండలంలో 2,952 అకౌంట్లు, లేపాక్షి మండలంలో 3,268 అకౌంట్లు ఉన్నాయి.