జిల్లాలో ‘అమ్మ ఒడి’ ప్రారంభించిన మంత్రి
సాక్షి, పశ్చిమగోదావరి : పేద కుటుంబ పిల్లలు కూడా విద్యలో ఉన్నత స్థాయిలో ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల 26 వేల 817 మంది తల్లుల ఖాతాలో రూ. 503 కోట్లు జమకానున్నాయని తెలిపారు. జిల్లాలో ఆరు లక్షల 22 వేల 583 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు.
ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి రూ. 15 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి.. ముఖ్యంత్రి మదిలో నుంచి వచ్చిన పథకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడికి రూ. 6456 కోట్లు కేటాయించమన్నారు. ఏలూరు నియోజకవర్గంలో 24 వేల కుటుంబాలకు రూ. 35 వేల కోట్ల రూపాయలు తమ ఖాతాలో జమకానున్నాయన్నారు. పేద తల్లుల బతుకులు మార్చే గుడి అమ్మ ఒడి అని, ఇది మూడు దశల్లో అమలు అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు.