విషపుకాయలు తిని నలుగురు చిన్నారులకు అస్వస్థత | afte eating pioson gas four children eat and sickness | Sakshi
Sakshi News home page

విషపుకాయలు తిని నలుగురు చిన్నారులకు అస్వస్థత

Aug 23 2013 4:43 AM | Updated on Sep 1 2017 10:01 PM

పెళ్లింట విషాదం అలముకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు విషపూరితమైన కాయలుతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది

మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్: పెళ్లింట విషాదం అలముకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు విషపూరితమైన కాయలుతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. చిన్నారుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు... గౌనిగారిపల్లెలో గురువారం ఓ ఇంట్లో వివాహం జరుగుతోంది. అదే సమయంలో ఇరుగుపొరుగుకు చెందిన వెంకటేష్ కుమారుడు బ్రహ్మ(5), ఆనంద్ కుమారుడు మధు(7), నాగరాజు కుమారుడు వినయ్‌కుమార్(5), రెడ్డినారాయణ కుమారుడు భాస్కర్‌బాబు(5) పెళ్లింట ఆడుకుంటున్నారు.
 
  ఆ ఇంటివద్ద ఉన్న యర్రాముదం(జెట్రోఫా) చెట్టు కింద కాయలు పడి ఉన్నాయి. ఆ కాయలు నిమ్మకాయల సైజులో ఉండడంతో తినే కాయలని భావించి నలుగురు చిన్నారులు తిన్నారు. కొద్దిసేపటికే ఆ నలుగురు తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.  పెళ్లిభోజనం ఏమైనా విషాహారంగా మారిందేమోనని కంగారు పడ్డారు. చిన్నారులను అడగడంతో తాము పెళ్లి భోజనం ఇంకా తినలేదని, ఆ కాయలను తిన్నామని చూపించారు. దీంతో వెంటనే చిన్నారులను 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లలను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన పనిలేదని, త్వరగానే పిల్లలు కోలుకుంటారని చిన్నపిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement