అదనపు నీటి నిల్వ సరికాదు | Additional water storage is incorrect | Sakshi
Sakshi News home page

అదనపు నీటి నిల్వ సరికాదు

Sep 17 2014 1:06 AM | Updated on Sep 2 2017 1:28 PM

గతంలో జరిగిన ఒప్పందాలను విస్మరిస్తూ పులిచింతల ప్రాజెక్టులో అదనపు నీటిని నిల్వ చేస్తూ..

పులిచింతలపై ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ    
 
హైదరాబాద్: గతంలో జరిగిన ఒప్పందాలను విస్మరిస్తూ పులిచింతల ప్రాజెక్టులో అదనపు నీటిని నిల్వ చేస్తూ.. గ్రామాల ముంపునకు కారణమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులో 42.8 మీటర్ల మేర నీటిని నిల్వ చేయడంతో నల్లగొండ జిల్లాలోని నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి ఎలాంటి సహాయ పునరావాసం కల్పించకుండా ఇలా నీటిని నిల్వ చేయడంపై అభ్యం తరం తెలిపింది. తక్షణం నీటి నిల్వను 40 మీటర్లకు తగ్గించాలని కోరింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఏపీ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు.

‘ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సమావేశంలో 40 మీటర్ల వరకే ప్రాజెక్టులో నీటిని నింపాలని రెండు రాష్ట్రాల అధికారులు అవగాహనకు వచ్చారు. సాగర్ ఇన్‌ఫ్లో కారణంగా పులిచింతల ప్రాజెక్టులో గత అవగాహనకు భిన్నంగా 42.8 మీటర్ల మేర నీటి నిల్వ ఉం చారు. దీంతో నాలుగు గ్రామాల ను నీరు చుట్టుముట్టింది. ఇక్కడి గ్రామస్థులకు సహాయ పునరావాసం కింద అందాల్సిన రూ.60 కోట్లు ఇవ్వకుండా నిల్వను పెంచడం సరికాదు. తక్షణమే నీటి నిల్వను తగ్గించేలా సంబంధిత అధికారులను ఆదేశించండి’ అని వారు వేర్వేరుగా కోరారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్‌రావత్‌కు కూడా తెలంగాణ సీఎస్ లేఖ రాశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement