దీక్ష దేనికోసమో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలి | Sakshi
Sakshi News home page

దీక్ష దేనికోసమో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలి

Published Sat, Dec 14 2019 10:52 AM

Abbaya Chowdary Fires On Pawan Kalyan In Denduluru - Sakshi

సాక్షి, దెందులూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రైతు దీక్ష దేనికోసం చేశారో అందరికీ తెలిసిందేనని, కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి ఆయన తన అక్కసు వెళ్లగక్కుక్కునే వేదికగా రైతు సౌభాగ్య దీక్ష చేశారని, దీక్ష దేనికోసమో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి డిమాండ్‌ చేశారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించటం ద్వారా తెరవెనుక ఒప్పందం చేసుకున్న రాజకీయ నాయకులకు సహాయ పడదామన్న అత్యాసతో ఉన్నట్లు పవన్‌ కల్యాణ్‌ తీరు కనబడుతోందన్నారు.

రైతుల గురించి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, జనహృదయ నేత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయటంలో పవన్‌ కల్యాణ్‌ లక్ష్యం ఏమిటనేది నేరుగా ప్రకటించాలని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. పరిష్కారమైన సమస్యలపై ప్రశ్నలు వేస్తే ప్రజలకు జనసేన దేనికోసం పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం సమయంలో కాలువలు ఆధురికీకరణ చేయకపోయినా, గత ఐదేళ్లూ పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకపోయినా ఎందుకు పన్నెత్తి మాట అనలేదన్నారు. ప్రజల్లో పరువు తీసుకోవద్దని పవన్‌ కల్యాణ్‌కు అబ్బయ్య చౌదరి హితవు పలికారు.

Advertisement
Advertisement