ఇప్పుడే వస్తాను.. బాబును కొంచెం చూస్తుండమ్మా... అని చెప్పి తన ఏడు నెలల బాబును గుర్తు తెలియని మహిళకు అప్పగించి వెళ్లిన ఓ తల్లి, తిరిగివచ్చి చూసేసరికి బాబుతో సహా ఆ మహిళ మాయమైంది.
గుంటూరు: ఇప్పుడే వస్తాను.. బాబును కొంచెం చూస్తుండమ్మా... అని చెప్పి తన ఏడు నెలల బాబును గుర్తు తెలియని మహిళకు అప్పగించి వెళ్లిన ఓ తల్లి, తిరిగివచ్చి చూసేసరికి బాబుతో సహా ఆ మహిళ మాయమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నల్లచెరువు పరిధిలోని చాకలి కుంటకు చెందిన ధనలక్ష్మి ఒంట్లో నలతగా ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యుడిని కలవడానికి ఓపీ లోకి వెళ్లే ముందు ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఒక మహిళ చేతిలో తన ఏడు నెలల బిడ్డ (రవితేజ)ను ఉంచి.. కొంచెం చూస్తుండమ్మా, వెంటనే వస్తానని చెప్పి లోపలికి వెళ్లింది. వైద్యుడిని సంప్రదించిన అనంతరం బయటకు వచ్చి చూసేసరికి సదరు మహిళ బిడ్డతో సహా కనిపించలేదు. దాంతో లబోదిబోమన్న ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది.