విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం

సాక్షి, విజయవాడ: విజయవాడలో 29వ పుస్తక మహోత్సవం నేడు ప్రారంభమైంది. 28 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక మహోత్సవం ఈ ఏడాది కోత్త హంగులతో కొలువుదీరింది. ఈ సందర్భంగా స్వరాజ్‌ మైదాన్‌లో ‘ నన్ను ప్రభావితం చేసిన పుస్తకం’ అనే అంశంపై సదస్సి జరిగింది. ఈ సరస్సుకు సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకులతో వారికి నచ్చిన పుస్తకం పై మాట్లాడించాలనేది మంచి ఆలోచన.  ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశం ప్రేరణ కలిగిస్తుంది. ఈ ప్రేరణ తో తమ జీవనశైలిని మార్చుకునే వారే తమ లక్ష్యం సాధిస్తారు. దేశ, విదేశాల్లో అనేక ఉద్యమాలను నడిపిన వారికి పుస్తకాలే ప్రేరణ కలిగించాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మందిని ప్రభావితం చేసినవి కూడా పుస్తకాలే. సమాజాన్ని, దేశాన్ని అర్ధం చేసుకోవడానికి పుస్తకాలు దోహదం చేశాయి.  ఇప్పుడు పుస్తకానికి, రాజకీయానికి మధ్య దూరం పెరుగుతోంది.  పుస్తక స్పర్శ తెలియని రాజకీయ నాయకులకు, పుస్తకాల ద్వారా జ్ఞానం ఆర్జించిన నేతలకు మధ్య తేడా తెలిసిపోతోంది’ అని ఆయన అన్నారు. 

ఇందులో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లక్షీపతి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ మహోత్సవం నేటి నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top