సచివాలయ పోస్టుల పరీక్ష కేంద్రాలకు కసరత్తు

2 Lakh Unemployed Youth In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు రికార్డు స్థాయిలో భర్తీ చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నియామక పరీక్ష సెప్టంబర్‌ 1న ఉండే అవకాశముండటంతో సమర్థంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నా తలంపుతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పరీక్షా కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రాథమికంగా జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని వసతులు ఉన్న 497 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో అభ్యర్థులకు అవసరమైన గాలి, వెలుతురు, రవాణా సౌకర్యం తదితర ఆంశాలను పరీక్షిస్తున్నారు.

2 లక్షల మందికి పైగా రాసే అవకాశం..
భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం, గత పాలకుల నిర్వాకం వల్ల నిరుద్యోగులు పెరగటంతో సచివాలయ పోస్టులకు డిమాండ్‌ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకుపైగా పరీక్ష రాసే అవకాశముందని భావిస్తున్నారు. జిల్లాలో 933 గ్రామ, 511 వార్డు సచివాలయాలకు గాను 11,025 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన 497 కేంద్రాలతో సుమారు 1.33 లక్షల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. మరో 70 వేల మందికి పైగా పరీక్షరాయనుండటంతో వారికోసం పరీక్ష కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి తోడు మరో 200 సెంటర్లు సిద్ధం చేయటానికి జెడ్పీ సీఈఓ, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు.

విధులు నిర్వహించనున్న 20 వేలమంది అధికారులు, సిబ్బంది
జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా నిరుద్యోగులు పరీక్ష రాయనుండటం సుమారు 700 దాకా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటంతో అంతే స్థాయిలో అధికారులు, సిబ్బంది అవసరమవుతారు. ఇందుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర అధికారులను విధుల్లోకి తీసుకోనున్నారు. పరీక్షా కేంద్రంలో ప్రతిగదికి ఓ ఇన్విజిలేటర్, చీఫ్‌ సూపరింటెండెంట్, సిట్టింగ్, ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్, రూట్‌ అధికారులు పనిచేయనున్నారు. అలాగే భద్రతా పరమైన ఏర్పాట్లకు పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది అవసరమం కానున్నారు. ముఖ్య పట్టణాలతో పాటు చిన్న నగరాల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నడంతో రవాణా ఏర్పాట్లపైనా అధికారులు దృష్టిపెడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top