క్షమించండి.. 108 లేదు!
రాజాం అమ్మవారి కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం
108కు ఫోన్చేసిన ప్రయాణికులు
అంబులెన్సు అందుబాటులో లేదని చెప్పిన కాల్రిసీవర్
శ్రీకాకుళం, రాజాం: మంగళవారం సాయంత్రం 5.30 గంటలు.. రాజాంలోని బొబ్బిలిరోడ్డులో అమ్మవారి కాలనీ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలుపరస్పరం ఢీకొన్నాయి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు..ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనచోదకులు స్పందించి క్షతగాత్రులను పక్కకు తీసి 108 అంబులెన్సుకు ఫోన్చేశారు. 108 వాహనం అందుబాటులో లేదని, ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించాలని ఉచిత సలహా చెప్పడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు.
మరోవ్యక్తి ఫోన్ చేసినా అదే సమాధానం రావడం గమనార్హం. ఇదీ రాజాం పట్టణానికి కిలోమీటరున్నర దూరంలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటన వద్ద చోటుచేసుకున్న పరిస్థితి. బొబ్బిలిరోడ్డులో అమ్మవారి కాలనీ సమీపంలో సాలూరు వైపు ద్విచక్రవాహనంతో వెళ్తున్న భార్యాభర్తలు, అటునుంచి రాజాం వస్తున్న మల్లికార్జున కాలనీకి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనాలతో పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో మల్లికార్జున కాలనీకి చెందిన యువకుడితో పాటు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 108 రాకపోవడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజాం పోలీసులు కూడా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు.