పులివెందుల రూరల్ : వైద్య సేవల్లో వైఎస్సార్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని డీఎంహెచ్ఓ యుగంధర్ పేర్కొన్నారు. కొత్తపల్లె, ఇ.కొత్తపల్లె గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్లు, నల్లపురెడ్డిపల్లె పీహెచ్సీని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ అందిస్తున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఖాజా మెయినుద్దీన్, డీపీఎంఓ డాక్టర్ మహమ్మద్, డీపీఓ నారాయణ, డాక్టర్ బాలాజి, మలేరియా నివారణ సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్ధయ్య, సీనియర్ అసిస్టెంట్ నరేష్, హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆశా కార్యకర్తపై ఫిర్యాదు
వేంపల్లె మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త పని తీరుపై గ్రామస్తులు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామస్తులు విజయభారతి, రమణారెడ్డి, ప్రసాద్, రామసుబ్బారెడ్డిలు కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికి డీఎంహెచ్ఓ స్పందిస్తూ ఆమె పనితీరు మెరుగుపరుచుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చామని, ఆ వ్యవధిలో మార్పు కనిపించకపోతే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


