పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులు కింద కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి లేదు. అన్ని పరీక్షా కేంద్రాలలో కూడా డెస్కులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఏలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా వచ్చి పరీక్షలను రాయాలి.
– షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్జిల్లా
పది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, ఫర్నీచర్తోపాటు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి 8.45 గంటల నుంచే అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలేవైనా ఉంటే తెలిపేందుకు వీలుగా ఈనెల 16 నుంచి కడప డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 91218 46205 నెంబర్ సిద్ధం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విధి నిర్వహణలోని ఉపాధ్యాయులు కంట్రోల్ రూమ్ సేవలను ఉపయోగించుకుని సలహాలు, ఫిర్యాదులు తెలపవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు.
జిల్లాలో 9 సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు...
జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇందులో బి.మఠం మండలం కందిమల్లాయపల్లె జెడ్పీ హైస్కూల్, జెడ్పీ బాలికల హైస్కూల్, కమలాపురం జెడ్పీ బాలికల హైస్కూ ల్, జెడ్పీ బాలుర హైస్కూల్, సిద్దవటం ఎగువపేట జెడ్పీ హైస్కూల్, వల్లూరు జెడ్పీ హైస్కూల్, వేంపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్, జెడ్పీ బాలికల హైస్కూల్, మైదుకూరు జెడ్పీ ఉర్దూ హైస్కూల్స్ను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం..
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. విద్యార్థులు హాల్టికెట్ చూపించి బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఓపెన్ టెన్త్ పరీక్షలకు 2424 మంది..
సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ పది పరీక్షలు) పరీక్షలకు జిల్లాలో 2424 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
మాస్కాపీయింగ్కు
ఆస్కారం లేకుండా చర్యలు
విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా రాసే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయించాం. విద్యార్థులంతా 8.45 గంటల నుంచే పరీక్షా కేంద్రాలలోని అనుమతించాలని చెప్పాం. పొరపాటున ఏ పరీక్షా కేంద్రంలోనైనా ఆరోపణలు వచ్చినా చర్యలు ఉంటాయి. పరీక్ష విధులకు కేటాయించిన సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహించాలి. ఎక్కడ కూడా మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి.
– కాగిత శ్యాముల్, ఆర్జేడీ, పాఠశాల విద్య
ప్రశాంతంగా వెళ్లాలి..
విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఈ పబ్లిక్ పరీక్షలను సైతం గతంలో రాసిన మోడల్ పరీక్షలే అనుకున్నట్లయితే మరింత ఆత్మవిశ్వాసంతో రాయగలరు. మనసులో ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష ప్రశాంతంగా ప్రారంభించాలి. పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరడం ఉత్తమం. పరీక్షకు వచ్చే ముందు ఖచ్చితంగా ఏదో ఒకటి తిని రావాలి.
– ఓ. వెంకటేశ్వరెడ్డి, ప్రముఖ సైకాలజిస్టు


