ముస్తాబైన మసీదులు
కడప సెవెన్రోడ్స్: ముస్లింలకు శుభప్రదమైన, పుణ్యప్రదమైన రాత్రి షబేఖదర్ రానే వచ్చింది. దీనిని లైలతుల్ఖదర్ అని కూడా పిలుస్తారు. షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే ఉన్నతమైన అని అర్థం. రంజాన్ మాసంలో 27వ రాత్రి వచ్చే షబ్ ఏ ఖద్ర్ రోజునే పవిత్ర దివ్యఖురాన్ అవతరించిందని ముస్లింల నమ్మకం. సోమవారం ముస్లింలు లైలతుల్–ఖదర్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రేయంతా ఇషా నమాజ్ నుంచి తెల్లవారుజామున సెహరి వేళ వరకు ముస్లింలు అధ్యాత్మికంగా గడుపుతారు. తరావీహ్ నమాజ్, బయాన్, హదీస్, ఖురాన్ తిలావత్, సలాతుజ్, తజ్బీ, తహజ్జుద్ నమాజ్, దువా ఇలా రేయంతా అల్లాహ్ ఆరాధనలో గడుపుతారు. తోబా,ఆస్తగ్ పిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమాపణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుతారు. ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రంతా జాగరణ చేసి, అధ్యాత్మికంగా గడిపిన వ్యక్తికి వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని ముస్లింల విశ్వాసం.
● నేడు బడీరాత్ పర్వదినం
● విద్యుత్దీపాల అలంకరణలో మసీదులు
ప్రత్యేక ప్రార్థనలతో అధిక ఫలితం
షబే ఖదర్ రోజున జాగర ణ చేసి, అధ్యాత్మికంగా గడపాలి. నమాజ్, తరావీహ్, నఫిల్ నమాజ్, తహజ్జూద్ వంటి ప్రత్యేక ప్రార్థనలతో అధికంగా ఫలితం లభిస్తుంది. ఈ రేయంతా అల్లాహ్ స్మరణలో గడిపితే వెయ్యి నెలల పుణ్యం లభిస్తుంది.రవీంద్రనగర్లోని మస్జిద్ ఏ బుఖారియాలో షబ్ ఏ ఖద్ర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం.
– సయ్యద్ సిరాజుద్దీన్ బుఖారి, ఇమాం,
మస్జిద్ ఏ బుఖారియా
మసీదులు విద్యుద్దీపాలంకరణతో శోభిల్లుతు న్నాయి. షబ్బే ఖద్ర్ సందర్బంగా మత గురువులు, ఆధ్యాత్మికవేత్తలు భక్తులనుద్దేశించి పవిత్ర మాసం విశిష్ఠతలను తెలియజేయనున్నారు. ఇప్పటికే తాఖ్ రాత్లను నిర్వహిస్తున్న మసీదుల్లో తెల్లవారుజామున సెహరీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మసీదు కమిటీ ప్రతినిధులు విశేష ఏర్పాట్లు చేశారు.


