ప్రైవేట్ పాఠశాలల బకాయిలను విడుదల చేయాలి
కడప కార్పొరేషన్ : విద్యా హక్కు చట్టం ద్వారా చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయంబర్స్మెంటు నిధులను వెంటనే విడుదల చేయాలని శాసన మండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉందన్నారు. 4 ఏళ్ల నుంచి బకాయిలు పెండింగ్లో ఉండగానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం(బాస్) ద్వారా చదువుకున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ చేయాల్సి ఉందని, ఈ పథకంలో నాలుగేళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలకు రూ.70కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. వీటిని వెంటనే నిధులు విడుదల చేసి ప్రైవేటు పాఠశాలలను ఆదుకోవాలని ఆయన కోరారు.


