12వ పీఆర్సీ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
వేంపల్లె : 12వ పీఆర్సీ అమలు కోసం ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం వేంపల్లెలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు, ఎస్టీయూ నేతల సమక్షంలో ఉద్యమ శంఖారావ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేనిఫెస్టో ఆధారంగా ఇచ్చిన ఆర్థిక పరమైన హామీల అమలు సాధన కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర కమిటీ గత జనవరిలో ఇచ్చిన మూడు దశల పోరాట శంఖారావం పిలుపు మేరకు ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. 12వ వేతన సవరణ కోసం ఇప్పటికే 32 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారన్నారు. 2023 జూలై నాటి నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ కూడా విడుదల చేయలేదన్నారు. చనిపోయిన ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు లేకపోవడంతో చాలా మంది ఎదురు చూస్తున్నారన్నారు. సీపీఎస్ను రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెడతామన్న హామీ గాలికి వదిలేశారన్నారు. రూ.34 వేల కోట్ల బకాయిలు ఉద్యోగులకు బాకీ ఉండగా, దానికి సంబంధించిన కేటాయింపులు ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లో లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు ధర్మారెడ్డి ప్రతాపరెడ్డి, ఉపాధ్యాయులు గోవిందు, భాస్కర్రెడ్డి, లక్ష్మీనరసింహ, శ్రీనివాసరెడ్డి, జనార్దన్రెడ్డి, మహబూబ్ బాషా, అమీర్, రాజశేఖర్రెడ్డి, రాగి సుధాకర్, జయప్రద తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వరరెడ్డి


