జన జాతర
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గంగమ్మ దేవత జాతర జనసంద్రమైంది. బుధవారం ప్రారంభమైన ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతూ దర్శనమిచ్చిన అమ్మవారి ఎదుట మహిళలు ఒరపడ్డారు. కరుణించమ్మా అంటూ మొక్కుకున్నారు.
బోనాలతో మొక్కులు చెల్లింపు....
కస్తూరిరాజుగారిపల్లి గ్రామం, చాగలగుట్టపల్లి అమ్మవారిని పూజాది కార్యక్రమాల అనంతరం అర్థరాత్రి సమయంలో ఆరుబయట ఉంచారు. సాంప్రదాయబద్ధంగా పళ్లు కృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు తొలి బోనంగా అమ్మవారికి జంతుబలులను సమర్పించారు. జాగారానికి తరలిన భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించా రు. తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరిన అమ్మవారు అప్పలరాజుగారిపల్లి, ఎస్సీ కాలనీ, మార్లవాండ్లపల్లి, మర్రిచెట్టు, చౌటపల్లి గ్రామాల మీదుగా అత్యంత అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు సాగింది. ఈడిగపల్లి గౌడ్లు కళ్లు సాంగ్యంతో అమ్మవారిని ఆలయంలోకి తీసుకెళ్తూ సంతానం కోసం వరపడిన మహిళలు మీదుగా అమ్మవారిని ఆలయంలోకి చేర్చారు. వరపడిన మహిళలకు సిద్దులపూజ అనంతరం సిద్దుల ప్రసాదాన్ని అందజేసి భక్తులకు అమ్మవారి సర్వదర్శనాన్ని కల్పించారు. పలు మానవతా స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లబాటిళ్లు పంపిణీ చేశాయి. జాతరలో చాందినీ, కుంకుమ బండ్లు భక్తులను ఆకర్షించాయి. జాతరలో ఏర్పాటు చేసిన చెక్కభజన, కోలాటం, ఆర్కెస్ట్రా, జబర్దస్త్, రేలారే రేలా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు యువతను ఉర్రూతలూగించాయి. ఈ సంవత్సరం రూ. 300లు దర్శనాన్ని ఏర్పాటు చేయడంతో వీఐపీలకు సులభతరంగా అమ్మవారి దర్శనం కలిగినట్లు అయ్యింది. డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సిఐ కృష్ణంరాజు నాయక్, లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ శోభ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశారు. మొక్కులు ఉన్నవారు అమ్మవారికి బోనాలు సమర్పించడంతోపాటు తలనీలాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
జన జాతర


