గనుల నిర్వహణపై దృష్టి సారించాలి
కడప సెవెన్రోడ్స్ : జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మైనింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ రకాల ఖనిజ వనరుల లభ్యత, గనుల నిర్వహణ సంబంధిత అంశాలపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్ లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైన్స్ డీడీ సుబ్రమణ్యం, మైన్స్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్లు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘స్టార్ట్ అప్ కడప’ లక్ష్యం..
యువతకు స్ఫూర్తిదాయకం
ఉద్యోగం అందుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు అందించే స్థాయికి యువత ఎదగాలన్న లక్ష్యంతో జిల్లాలో రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ యువత నైపుణ్యతకు స్ఫూర్తిగా నిలవనుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో పి4 విధానం ద్వారా జిల్లాలో ఇన్నోవేటీవ్గా నిర్మిస్తున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ స్థాపన ఉద్దేశం, ప్రత్యేకతలు మొదలైన అంశాలపై జిల్లాలోని పలువురు విద్యావేత్తలైన పి4 భాగస్వాములతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సదుపాయాలతో అన్ని రకాల మౌలిక వసతులతో రూపుదిద్దుకోనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్.. యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివద్ధికి పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రాజశేఖర్, చంద్ర ఓబుల్రెడ్డి (కెఎస్ఆర్ఎం విద్యాసంస్థల చైర్మన్), అర్జీయూకేటీ డైరెక్టర్ డా.గోపాల రాజు, ఏఐటీఎస్ ఈడీ, కెఎంసి కమిషనర్ మనోజ్రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా, హౌసింగ్ పీడి రాజా రత్నం, స్టెప్ సీఈవో నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ డీఎస్డీఓ వినీల్ కుమార్, ఎల్డీఎం జనార్దనం, విద్యావేత్తలు, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు.


