చెన్నూరులో దొంగల ముఠా హల్చల్
వల్లూరు(చెన్నూరు): చెన్నూరులో ఆదివారం రాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. శివరాత్రి సందర్బంగా తాళాలు వేసి వివిధ తిరునాళ్లకు ఇంటిల్లిపాదీ వెళ్లిన గృహాలను ఎంచుకున్న దొంగలు ఇంటి తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన సమాచారం మేరకు చెన్నూరులోని బెస్త కాలనీకి చెందిన పలు కుటుంబాలు శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని దైవ దర్శనంతో బాటు జాగారం చేయడానికి ఆదివారం బైరవేశ్వర కోనకు వెళ్లారు. బుడ్డాయపల్లెకు చెందిన రాములమ్మ పొలతల పుణ్యక్షేత్రానికి వెళ్లింది. దొంగలు బెస్తకాలనీలోని టైలర్ శివ, క్యామన చలపతి, గుగ్గిర వెంకట రమణ గృహాలతో బాటు బుడ్డాయపల్లెలోని రాములమ్మ ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాల తాళాలు పగుల గొట్టి అందులోని బట్టలను చిందరవందరగా వేసి చోరీకి పాల్పడ్డారు. ఇందులో దాదాపు 25 నుంచి 30 తులాల బంగారు నగలు, సుమారు 3 లక్షల రూపాయల వరకు నగదు చోరీకి గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ పరిశీలించింది. బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.
సీసీ టీవీ పుటేజీల పరిశీలన
దొంగతనం జరిగిన రెండు కాలనీలు కడప– కర్నూలు హైవేకు పక్కనే వున్నాయి. బెస్తకాలనీలో ఒకే వీధిలోని మూడు గృహాల్లో చోరీ జరిగింది. పోలీసులు విచారణలో భాగంగా అందుబాటులో వున్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలించగా, కొంత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఐదుగురితో కూడిన దొంగల ముఠా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో వారు ముఖాలకు ముసుగులతో బాటు చేతులకు గ్లౌసులను ధరించినట్లు తెలుస్తోంది.
శివరాత్రి ఉత్సవాలకు వెళ్లిన వారికి
చెందిన నాలుగు ఇళ్లలో చోరీ
చెన్నూరులో దొంగల ముఠా హల్చల్


