బడ్జెట్లో సంక్షోభం మాత్రమే కనిపిస్తోంది
ప్రొద్దుటూరు : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో విడత బడ్జెట్లో సంక్షేమ పథకాలు లేవని, సంక్షోభం మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం తన క్యాంప్ కార్యలయంలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని అటకెక్కించారని తెలిపారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 72 లక్షల పింఛన్లలో 5 లక్షల పింఛన్లను రద్దు చేశారని, ఈ బడ్జెట్లో మరో 8 లక్షలను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేశారన్నారు. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి 82 లక్షల మందికి గాను 50 లక్షల మందికే ఇచ్చేలా నిధులు కేటాయించారన్నారు. మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి అవసరమైన డబ్బు బడ్జెట్లో ప్రవేశపెట్టలేదని తెలిపారు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇవ్వాల్సి ఉండగా మొదటి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అసలు నిధులే కేటాయించలేదన్నారు. ఇవి కోతలని తెలిపారు. నిరుద్యోగులందరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి రూ.3వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించలేదన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు రెండేళ్లవుతున్నా ఎందుకు అమలు చేయలేకపోతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం తమకు రెండు కళ్లని కూటమి నేతలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ రెండు పథకాలు వారికి జేబులుగా మారాయని విమర్శించారు. ప్రజలకు చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 175కు 175 సీట్లలో ఓటమి చవిచూడాల్సి వస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


