చేనేత కార్మికురాలు ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : చేనేత పనిలో నష్టాలు రావడంతో లక్ష్మీశాంతి (36) అనే చేనేత కార్మికురాలు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, లక్ష్మీశాంతి దంపతులు చేనేత పని చేసుకొని జీవనం సాగించారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి సొంత ఇల్లు లేకపోవడంతో బాడుగ ఇంట్లో ఉంటున్నారు. భార్య భర్తలిద్దరూ చేనేత పని చేస్తేనే వారి సంసారం గడుస్తుంది.
ఇటీవల లక్ష్మీశాంతి కరెంట్ మగ్గం నిర్వహణపై ట్రైనింగ్ తీసుకుంది. కరెంట్ మగ్గం కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకున్నా పని చేసుకోవడానికి సులభతరం అవుతుందనే ఉద్దేశంతో అప్పు చేసి ఇటీవల ఇంట్లో కరెంట్ మగ్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజులుగా అప్పులిచ్చిన వారు బాకీ చెల్లించమని ఒత్తిడి చేయసాగారు. రుణదాతలకు చెప్పుకోలేక బాకీ చెల్లించే స్థోమత లేకపోవడంతో లక్ష్మీశాంతి ఆదివారం యాసిడ్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు కడపకు రెఫర్ చేశారు. రిమ్స్ వైద్యులు ఆమెను పరిశీలించి తిరుపతికి వెళ్లాల్సిందిగా సూచించారు. మీ క్రమంలో లక్ష్మీశాంతిని తిరుపతికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కాగా ఆమె వద్ద ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


