నాగార్జునసాగర్ : కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓల) బృందం సోమవారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించింది. కేంద్ర సర్వీస్లో నూతనంగా నియమితులైన వీరు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా కోఆర్టినేటర్ కవిత ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు. తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ బుద్ధుడి విగ్రహాలు, చైత్యాలు, సింహళవిహారం తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం బుద్ధవనంలోని బుద్ధచరితవనం, జాతకవనం, స్థూపపార్కు, ధ్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు. మహాస్థూపంలో పంచముఖ బుద్ధుల వద్ద బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర వారితో ధ్యానం చేయించారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ ఇక్కడి విశేషాలను వారికి వివరించారు. వారి వెంట పెద్దవూర ఆర్ఐ దండ శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.


