యాదగిరీశుడిని దర్శించుకున్న కలెక్టర్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ .. గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి వారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ లడ్డూ ప్రసాదం, శ్రీస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
అదనపు కలెక్టర్
బాధ్యతల స్వీకరణ
సాక్షి, యాదాద్రి : యాదాద్రిభువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్గా వెంకారెడ్డి గురువారం యాదాద్రి కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. శేరిలింగంపల్లిలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై యాదాద్రి జిల్లాకు వచ్చారు.
వేసవిలో దొంగతనాల నివారణకు గస్తీ ముమ్మరం
ఆలేరు: వేసవిలో దొంగతనాల నివారణకు గస్తీ ముమ్మరం చేయనున్నట్లు ఎస్పీ అక్షాంశ్యాదవ్ వెల్లడించారు. ఆధునీకరించిన ఆలేరు పోలీస్స్టేషన్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఠాణాలో సీఐ,ఎస్ఐ చాంబర్లతోపాటు రిసెప్షన్ కౌంటర్, విజిటర్స్ లాంజ్లను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఠాణాలో నిర్వహించిన అమ్మవారి పూజలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్నాయుడు, సీఐ యాలాద్రి, ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.
సెకండ్ ఇయర్ తొలి రోజు 5,709 మంది హాజరు
భువనగిరి: జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పేపర్–2 పరీక్షకు మొత్తం 5,858 మంది విద్యార్థులకు గాను 5,709 మంది హాజరు కాగా 149 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ పట్టణంలోని టైమ్స్, శ్రీ చైతన్య కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
ఆలేరురూరల్: ఆయిల్పామ్ సాగుతో రైతులు లాభాలు ఆర్జించవచ్చని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి మాధవి, డీఏఓ వెంకటరమణారెడ్డి, ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శంకర్ పేర్కొన్నారు. ఆలేరు మండలం సాయిగూడెంలో బేతి అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్, మామిడి తోటల సాగుపై రైతులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్త హరికాంత్, ఉద్యాన అధికారులు స్నేహిత, కవిత, శ్రీనివాస్, స్వర్ణలత పాల్గొన్నారు.
యాదగిరీశుడిని దర్శించుకున్న కలెక్టర్
యాదగిరీశుడిని దర్శించుకున్న కలెక్టర్


