రేచర్ల రెడ్డి రాజుల పాలనకు సాక్ష్యం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : కాకతీయుల కాలంలో పిల్లలమర్రిని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన రేచర్ల రెడ్డి రాజులు ఇప్పటి ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ దేవాలయంతో పాటు దాని సమీపంలో మెట్లు, యాగశాలతో కూడిన కోనేరును నిర్మించారు. కాలక్రమేణా ఈ కోనేరు పూర్తిగా పూడిపోయి ఆదరణ కోల్పోయింది. ప్రజాప్రతినిధులు అనేకసార్లు హామీ ఇచ్చినా పునరుద్ధరణకు నోచుకోలేదు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావి చుట్టూ కాకతీయులకు సంబంధించిన స్తంభాలు ఉన్నట్లు గుర్తించారు. కోనేటి అభివృద్ధి కోసం గతంలో అధికారులు నిధులు కేటాయించడంతో కోనేరు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ కోనేరు చుట్టూ వ్యవసాయ భూములకు నీటిని తోడేందుకు మోట బావులు ఉండటం విశేషం. ఇలాంటి కోనేరులను బాగు చేసి భావితరాలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు.


