ముదినేపల్లి(కై కలూరు): మద్యానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముదినేపల్లి పోలీసుల వివరాలు ప్రకారం గురజ గ్రామానికి చెందిన మాగంటి వేణుగోపాలరావుకు గుడివాడకు చెందిన వెంకటలక్ష్మీతో 2010లో వివాహం జరిగింది. వీరికి పాప, బాబు సంతానం. వేణుగోపాలరావు తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐదు సంవత్సరాలుగా మద్యానికి బానిసై భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంపై ఆమె గుడివాడలో తండ్రి వద్ద పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం వేణుగోపాలరావు గురజలో తన తల్లిని మద్యానికి డబ్బులు అడిగాడు. ఆమె ఇచ్చింది. మళ్లీ వచ్చి డబ్బులు కావాలన్నాడు. లేదని చెప్పడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం చండీహోమం నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాటుచేసిన చండీహోమంలో 23 మంది దంపతులు పాల్గొన్నారు. భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మాడ వీధుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సప్త ప్రదక్షిణాలు చేశారు. రాత్రి స్వామివారికి ధూపసేవ, పంచ హారతులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, చైర్మన్ మీసాల రామచంద్రరావు పాల్గొన్నారు.


