సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
భీమవరం: అయోధ్య రామ మందిరంలో నిధులు మాయం చేసిన ఘటనలో అసలు దోషులను అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం భీమవరంలో మీడియాతో మాట్లాడారు. ట్రస్ట్ సొమ్ము దాదాపు రూ.200 కోట్లు మాయం కాగా ముఖ్యమంత్రి యోగి సమాధానం చెప్పకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతికి 54 వేల ఎకరాలు ఎందుకని, తమ భూములు ఇవ్వలేమని వారి గోడు వెళ్ళబోసుకుంటున్న పెనుమాక రైతుల తరఫున మాట్లాడటానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై ఉండవల్లిలో దాడులు చేయడం దారుణమన్నారు. తాడిపత్రి గొడవలు, కృష్ణలంక, దళిత యువకుడి ఘటనలతో రాష్ట్రం ఎటు వెళ్తుందని ఈశ్వరయ్య ప్రశ్నించారు. సర్ పేరుతో ఓట్లు తొలగించేస్తున్నారని కలెక్టర్లు నిబద్ధతతో పని చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఈ నెల 30న తలపెట్టిన ఛలో అమరావతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పెన్మెత్స దుర్గాభవాని, జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, చెల్లబోయిన రంగారావు, ఎం సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు.


