బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు.. తరాలుగా పెనవేసుకున్న బంధాన్ని వీడి కట్టుబట్టలతో తమ ప్రాంతం విడిచి నిర్వాసిత కాలనీల్లో అడుగుపెట్టారు ఈ గిరి జనులు. ఇక్కడ ఉపాధి హామీ పనులు లేక, వసతులు కరువై సమస్యలతో సహవాసం చేస్తున్నారు. గ్రామాలు విడిచి ఏడేళ్లు గడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు.
పనుల్లేక.. జీవనం సాగక..
బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం సమీపంలో వేలేరుపాడు మండలంలోని చిగురు మామిడి, బోళ్లపల్లి, శ్రీరాంపురం, కొర్రాజుగూడెం, వసంతవాడ గ్రామాల నిర్వాసితుల కోసం కోసం పునరావాస కాలనీ (చిగురుమామిడి కాలనీ) నిర్మించారు. చిగురుమామిడి గ్రామానికి చెందిన 80 కుటుంబాలు, శ్రీరాంపురానికి చెందిన 10 కు టుంబాలు ఏడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరిలో 40 మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు కల్పిస్తుండగా మిగిలిన వారు జాబ్కార్డులు బదిలీ కా కపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పనుల్లేక అవస్థలు పడుతున్నారు. వీరంతా పనులు కల్పించాలని కోరుతున్నారు. కాలనీకి రెండు గ్రామాల నిర్వాసితులు రాగా.. మూడు గ్రామాల నిర్వాసితులు రా వాల్సి ఉంది. వీరంతా ఆర్అండ్ఆర్ పరిహారం అందిన తర్వాత వస్తారని తెలిసింది.
రాత్రిళ్లు భయం.. భయం
నిర్వాసిత కాలనీలో సోలర్తో పాటు విద్యుత్ లైట్లను ఏర్పాటుచేశారు. ఇవి చాలాకాలంగా వెలగక పోవడంతో రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. కాలనీలోని ఏ వీధిలోనూ దీపాలు వెలగడం లేదని చెబుతున్నారు. అయితే రాత్రిళ్లు పాముల బెడద ఎ క్కువ ఉందని, తాము వేలేరుపాడు మండలం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు చెప్పడంతో ఏం చే యాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఖాళీ ఇళ్లు.. సమస్యల లోగిళ్లు
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్లలో పిచ్చిమొక్కలు భా రీగా పెరిగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న కాలనీని చూసి నిర్వాసితులు ఆందోళ చెందుతున్నారు. ఉ పాధి హామీ పథకంలో అయినా పేరుకుపోయిన పిచ్చిమొక్కలును తొలగించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తుతోందని, నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే కాలనీలో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మించినా విద్యుత్ కోతల సమస్యతో నీటి సమస్య నెలకొందని అంటున్నారు. కాలనీలో చేతి పంపులు ఏర్పాటుచేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
పునరావాసం.. సమస్యలతో సహవాసం
చిగురుమామిడి కాలనీలో సమస్యల తిష్ట
వెలగని వీధిలైట్లు, పాముల బెడద
తాగునీటికి ఇక్కట్లు
కొందరికే ‘ఉపాధి’ పనులు
ఏడేళ్లు గడుస్తున్నా అందని జాబ్కార్డులు
కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు


