తాడేపల్లిగూడెం: జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేసేయ్ అన్న రీతిలో నియోజకవర్గంలోని కూటమి నేత వ్యవహార శైలి ఉంది. బాల వెంకటేశ్వర స్వామి భూములను కబ్జా చేసి విక్రయించి సొమ్ములు చేసుకున్న ఘనమైన చరిత్ర కలిగిన ఈ నేత తాజాగా పట్టణంలోని రెండో టౌన్లో బాలవెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నేత అక్రమాలకు అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెక్ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని దేవదాయ శాఖకు బదలాయించారు. కూటమి పాలన వచ్చాక సదరు నేత మళ్లీ అక్రమ నిర్మాణాలు చేశారు. కట్టడి చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేత ఉంటున్న ఇల్లు కూడా దేవదాయ శాఖకు చెందిన భూమిలో ఉందని కేసు నమోదైంది. దేవదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో అక్రమ రహదారి నిర్మాణానికి చెక్ పెట్టారు. అక్రమ నిర్మాణాలపై దేవదాయశాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది,. కూలగొట్టడానికి మాత్రం ఆ శాఖ వెనుకడుగు వేస్తోంది.
దేవదాయ శాఖ భూమిలో నిర్మాణాలు


