విద్యుత్‌ ఎస్‌ఈకి వైఎస్సార్‌సీపీ లీగల్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఎస్‌ఈకి వైఎస్సార్‌సీపీ లీగల్‌ నోటీసులు

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

విద్యుత్‌ ఎస్‌ఈకి వైఎస్సార్‌సీపీ లీగల్‌ నోటీసులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి ఎలాంటి ముందస్తు నోటీసూ ఇవ్వకుండా విద్యుత్‌ సర్వీసును తొలగించిన అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన విద్యుత్‌ అధికారులకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయానికి ఇటీవల విద్యుత్‌ సరఫరాను తొలగించారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా సర్వీసును తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నాయకులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సదరు కార్యాలయానికి మూడు రోజుల్లోపు సర్వీసును పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను నాయకులు ఈనెల 12న ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సాల్మన్‌రాజుకు కలిసి అందచేశారు. ఈ నెల 15 తేదీలోపు విద్యుత్‌ సర్వీసును పునరుద్ధరించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. లీగల్‌ సెల్‌ నాయకులు కోర్టు ధిక్కరణ నోటీసులు అందచేశారు. ఉత్తర్వులను ధిక్కరించిన నేరానికి జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని సదరు నోటీసులో గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement