భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పంచారామ క్షేత్రానికి చెందిన గునుపూడి టిడ్కో ఇళ్ల సమీపంలోని వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా భక్తులు గమనించి పంచారామ క్షేత్ర అధికారులకు తెలియజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఆలయ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. వారి ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులు మట్టి తవ్వుతున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా దేవస్థానం భూమిలో మట్టి తవ్వకాలకు సిద్ధపడడంపై అటు భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు (టూటౌన్): యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇందన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరతా లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.


