తాడేపల్లిగూడెం : నేలసారాన్ని కాపాడుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి పద్ధతులు, నర్సరీల నిర్వహణ, సంరక్షణ పద్ధతులపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతిరైతూ తమ నేలను పరిరక్షించుకోవాలని, దాని ఆధారంగానే ఎరువులను వాడుకోవాలన్నారు. ఎరువుల ఖర్చును తగ్గించుకొని భూసారం పెంచుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు జీవ ఎరువులు, సూక్ష్మ జీవుల వాడకం, వర్మి కంపోస్టు పద్ధతులపై విశదీకరించారు. నాణ్యమైన చేప పిల్లల ఎంపిక, ఉత్పత్తి పద్ధతులు తల్లి చేపల ఎంపిక, అఽఽధిక దిగుబడులు సాధించడం గురించి తెలిపారు. వ్యాధులులేని అధిక దిగుబడినిచ్చే రోహు, కట్ల, మృగల, గ్రాస్ కార్ప్,సిల్వర్ కార్ప్ చేపల ఎంపిక గురించి వివరించారు. హార్మోన్ ఇంజక్షన్లు, నర్సరీల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి రాజ్కుమార్, జిల్లా సహకార సంఘం అధ్యక్షులు వసంత్ రావులు పాల్గొన్నారు.


