కోకో గింజల ధర పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కోకో గింజల ధర పెంచాలి

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

దెందులూరు: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్‌ సీతారామ కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అన్‌సీజన్‌ వర్షాకాలపు గింజలకు కిలోకు రూ.350 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేశాయని, అత్యంత నాణ్యత కలిగిన సీజన్‌ గింజలకు ప్రస్తుతం కంపెనీలు కిలోకు రూ.300 మాత్రమే ధర ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌ ధర ప్రకారం కిలో గింజలకు రూ.400 ఉందని, దిగుమతి సుంకాలతో అధర రూ.600 పైగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధర తగ్గినప్పుడు కోకో గింజలకు ధర తగ్గించిన కంపెనీలు పెరిగినప్పుడు ఎందుకు పెంచడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోకో రైతుల సంఘం, కోకో రైతులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో జాయింట్‌ సమావేశం వెంటనే జరిపి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య (అశోక్‌), రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్‌ బాబు,కూసం రామిరెడ్డి, ఆలపాటి శ్రీనివాసరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement