పెంటపాడు: మండలంలో పలు ప్రాంతాలలో మట్టి మాఫియా ఊపందుకొంది. కాగా ఇదే అదనులో బి.కొండేపాడుకు చెందిన టీడీపీ నాయకునిడిగా చెప్పుకునే ఒక వ్యక్తి ఓల్డ్ వయ్యేరుకు ఆనుకొని ఉన్న పొలం నుంచి సమీపంలో ఉండే మరో ఈనాం భూమిగా పిలిచే సుమారు 25 సెంట్లను ట్రాక్టర్లతో హడావుడిగా పూడ్చుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామ వీఆర్ఓ పద్మ, సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాస్, వీఆర్ఏ రాజు తదితరులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకం చేసినా, అనుమతులు లేని భూములు పూడ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏడో రోజు శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం, ఉదయం ఎనిమిది గంటల నుంచి నవకల స్నపనం, అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ స్వామి వారికి 12సార్లు పూలతో అర్చన, 12 రకాల ప్రసాదాలతో నివేదన చేశామన్నారు. దాతలు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థలవారు, వెలివేటి సత్య వెంకట సూర్య రామకృష్ణ దంపతులు, శ్రీ దత్త సర్వాణి దంపతులు, జమ్మి గంగరాజు, దివంగత ముదుపాక సింగరాజు కుటుంబ సభ్యులను అర్చకులు స్వామివారి వేద ఆశీస్సులు, శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారని ఈఓ కలగర శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


