ఏలూరు టౌన్: నగరంలో ట్రాఫిక్ నియంత్రణంలో భాగంగా నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఇటుకబట్టీల ట్రాక్టర్ డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఈ సమయంలో డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇష్టారాజ్యంగా నగరంలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్కు చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమనీ, ట్రాక్టర్ డ్రైవర్లు ముఖ్యంగా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.


