ఎంపీ విజయోత్సవ ర్యాలీపై మండిపాటు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆర్టీసీ ప్రయాణికులు వేసవి ఎండలను తట్టుకునేందుకు వీలుగా రెండు చోట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రీన్ షేడ్ పందిళ్లు వేశారు. స్థానిక ఎన్టీఆర్ బొమ్మ వద్ద వేసిన గ్రీన్ షేడ్ పందిరి పడిపోయింది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం గ్రీన్ షేడ్ నిమిత్తం ఏర్పాటు చేసిన నిచ్చెన మెట్లు, ఇనుప స్తంభాన్ని లాక్కెళ్లినట్లు భావిస్తున్నారు. ఇనుప స్తంభాలు పడిపోవడంతో పాటు వంగిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆదివారం రాత్రి వరకు పందిరిని పునరుద్ధరించలేదు.
ఏలూరు (టూటౌన్): డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఏలూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడాన్ని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్రంగా వ్యతిరేకించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న ఎంపీ సిగ్గు లేకుండా ఏ విధంగా నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చారో చెప్పాలన్నారు. కేసులో ఇరుక్కున్న తర్వాత ఏలూరు నియోజకవర్గంలో అడుగుపెడుతూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినప్పుడు తెలుగుదేశం పార్టీ హడావుడిగా నోటీసులు ఇచ్చినట్టు ప్రకటించిందని, ఆ నోటీసుకు ఏం సమాధానం చెప్పారు.. ఆ సమాధానాలకు తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుందనే వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. పర్యటనలు, విజయోత్స ర్యాలీలు నిర్వహించడం ద్వారా యువతకు ఇచ్చిన సందేశం ఏంటని ప్రశ్నించారు. యువత డ్రగ్స్కు బానిసలు అవ్వాలని, ఒకవేళ పట్టుబడితే కొంతకాలం అగి తర్వాత విజయోత్సవ ర్యాలీలతో రావాలని సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


