ఆగిరిపల్లి : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం శాంతి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో చేశారు. ఉభయ దాతలుగా ఆగిరిపల్లికి చెందిన నంజం రామకృష్ణ, శ్రీ లక్ష్మీ దంపతులు, తిరువూరుకు చెందిన కృష్ణ స్వామి దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
నరసాపురం రూరల్ : మండలంలోని వేములదీవి గ్రామం కాపులకొడపలో ఉన్న శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం స్వామి వారిని లక్ష్మీ నరసింహస్వామిగా అలంకరించారు. ఆలయ అర్చకులు పెద్దింటి అరుణ్కుమార్ ఆచార్యులు స్వామి వారికి విశేష సేవలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం ఆలయ ఆవరణలో అన్నసమారాధన నిర్వహించారు.
ఆగిరిపల్లి: ట్రాక్టర్పై కూలీలు ఎక్కించుకుని అతివేగంగా నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శుభశేఖర్ హెచ్చరించారు. శనివారం ఉదయం ఆగిరిపల్లిలో వ్యవసాయ కూలీలను ట్రాక్టర్ ఎక్కించుకుని ప్రమాదకరంగా నడుపుతున్న డ్రైవర్ను ఎస్సై శుభ శేఖర్ వెంబడించి కూలీలను కిందకి దింపి ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ట్రాక్టర్లను వ్యవసాయ పనుల కోసం మాత్రమే ఉపయోగించాలని, వాటిలో కూలీలను ఎక్కించుకుని రహదారులపై ప్రయాణించడం ప్రమాదకరమన్నారు. మండలంలో ప్రజలను ఎక్కించుకొని ప్రమాదకరంగా వాహనాలు నడిపితే వారి లైసెన్సులు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు రసధుని సాహితీ సంస్థ సహాయ కార్యదర్శి, రచయిత, కవి మామిడిశెట్టి శ్రీనివాసరావు రచించిన పడి లేచిన కెరటం కథకి ప్రత్యేక బహుమతి లభించింది. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాసరావు మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన వాసా ఫౌండేషన్, సాహితీ కిరణం సంయుక్తంగా నిర్వహించిన డాక్టర్ వాసా ప్రభావతి స్మారక కదల పోటీల్లో తన కథకు ప్రత్యేక బహుమతి లభించిందన్నారు. ఈ పోటీలకు 218 కథలు పోటీ పడగా తన కథకు ప్రత్యేక బహుమతి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా రసధుని సభ్యులు కొట్టి భాస్కరరావు, యర్రంశెట్టి వెంకటరత్నం, గుడాల హరిబాబు, వంగా నరసింహరావు తదితరులు శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేశారు.
ఏలూరు (టూటౌన్): చెక్బౌన్స్ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ శనివారం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల ప్రకారం ఏలూరు కొత్తపేట గిలకల గేట్ ప్రాంతానికి చెందిన కె. ప్రసాద్ ఆన్లైన్ కొరియర్ బుకింగ్ ఏజెంట్గా పని చేస్తుంటాడు. ఇతను తన కుటుంబ అవసరాల నిమిత్తం ఏలూరు శాంతి నగర్కు చెందిన గూడవల్లి విద్యాసాగర్ వద్ద 2022 అక్టోబర్ నెలలో రూ.6,80,000 అప్పుగా తీసుకున్నారు. ఆ బాకీ తీర్చే నిమిత్తం 2023 సెప్టెంబర్ నెలలోప్రసాద్ బ్యాంక్ చెక్ను అందచేశాడు. ఆ చెక్ ను అందుకున్న విద్యాసాగర్ దాన్ని బ్యాంకులో జమ చేయగా అది బౌన్స్ అయ్యింది. దీంతో బాధితుడు విద్యాసాగర్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో మోసానికి పాల్పడినందుకు నిందితుడు ప్రసాద్కు ఏడాది జైలు శిక్ష విధించి, రూ.6,80,000ను బాధితుడికి చెల్లించాలని ఆదేశించారు.


